తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఐలమ్మ పోరాటస్ఫూర్తి చిరస్మరణీయం.విలీన పోరుకు ఎర్రజెండానే అండ. నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు చరిత్రకం. పీడిత ప్రజల విముక్తికి ఐక్య పోరాటం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా. వీరనారి చాకలి ఐలమ్మ సాగించిన అసమాన పోరాటస్ఫూర్తి చిరస్మరణీయమని, నేటి తరానికి ఆమె ఆదర్శప్రాయురాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో గురువారం నిర్వహించిన పలు వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాబీర్ పాషా మాట్లాడుతూ.. నాటి భూస్వామ్య పెత్తందారీ దోపిడీపై, విసునూరు దేశ్ముఖ్ దౌర్జన్యాలపై ఎర్రజెండా అండతో ఎదురొడ్డి నిలిచిన వీరవనిత ఐలమ్మ అని కొనియాడారు. తన పంటను కాపాడుకునేందుకు ఆమె చేసిన తిరుగుబాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి గొప్ప దిక్సూచిగా మారిందన్నారు. ఆ మహత్తర పోరాటం వెట్టిచాకిరీ, నిజాం నిరంకుశ పాలన బానిస సంకెళ్లను తెంచి పీడిత ప్రజల విముక్తికి బాటలు వేసిందని గుర్తుచేశారు. దోపిడీ, అణచివేతలపై గర్జించిన నాటి యోధుల ఆశయ సాధనకు ప్రజలు ఐక్యంగా ఉద్యమించాలని, నేటికీ పేదలకు సంపూర్ణంగా భూమి, ఆవాసం అందకపోవడం దుర్మార్గమన్నారు. పీడిత ప్రజల ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధ్యమని, ఐలమ్మ పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో భూ సమస్యలపై రాజీలేని ప్రజా ఉద్యమాలను ఉధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమాల్లో ఇంద్రాల మురళి, రాచర్ల వెంకటయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ