తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నేత్రదానం ద్వారా మరొకరికి చూపును ప్రసాదించవచ్చు: డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (UPHC)ను డీఎంహెచ్ఓ డా. తుకారామ్ రాథోడ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి, ప్రజలకు అందుతున్న సేవలపై వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రతి కుటుంబానికి సమతుల ఆహారం ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు మరియు ఇతర పోషక పదార్థాలను తగిన మోతాదులో తీసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు మరియు వృద్ధులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నేత్రదానంపై విస్తృత అవగాహన అనంతరం *నేత్రదాన అవగాహన పక్షోత్సవం (ఆగస్టు 25 నుండి సెప్టెంబర్ 8 వరకు)*లో భాగంగా నిర్వహించిన రేడియో టాక్ కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డా. తుకారం రాథోడ్ పాల్గొని ప్రజలకు నేత్రదానంపై విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ, మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా కార్నియా సమస్యల కారణంగా చూపును కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు చూపును అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం ఒక గొప్ప సామాజిక సేవ అని, ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా తన కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చని వివరించారు. నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి, వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల నేత్రదానానికి ముందుగానే సమ్మతి మరియు అవగాహన కలిగి ఉండటం ముఖ్యమన్నారు. నేత్రదానం గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు. “మరణానంతరం మన కళ్లను దానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని, నేత్రదానానికి ముందుకు రావాలి” అని డీఎంహెచ్ఓ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో వైద్య అధికారులు, వైద్య సిబ్బంది మరియు సంబంధిత ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ