తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : ఆదివాసీ హక్కులకై కదంతొక్కిన 'గిరి'జనం గిరిజనుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ మహాసభల్లో పాల్గొన్న సీపీఐ అగ్రనేతలు ప్రారంభమైన టీజీఎస్ రాష్ట్ర మహాసభలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో తెలంగాణ గిరిజన సమాఖ్య (టీజీఎస్) రాష్ట్ర మహాసభలు శనివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభల ప్రారంభ సూచికగా స్థానిక లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హాల్ నుండి పాత ఆర్డీవో కార్యాలయం రోడ్డులోని అమరజీవి సిద్ది వెంకటేశ్వర్లు స్మారక స్తూపం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనతో పాల్వంచ పురవీధులన్నీ గిరిజన జయధ్వానాలతో హోరెత్తాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచే కాకుండా, భద్రాద్రి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి గిరిజనులు, సీపీఐ, టీజీఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఈ ర్యాలీని విజయవంతం చేశారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో గిరిజన హక్కుల సాధనకై నేతలు గళమెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా అఖిల భారత ఆదివాసీ మహాసభ ఇంచార్జి, సీపీఐ జాతీయ కార్యదర్శి అనీ రాజా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరై దిశానిర్దేశం చేశారు. వారితో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా, టీజీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామావత్ అంజయ్ నాయక్, రాష్ట్ర అధ్యక్షులు రామ్మూర్తి నాయక్, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, కల్లూరి వెంకటేశ్వర్రావు, టీజీఎస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూక్య శ్రీనివాస్, సొందే కుటుంబరావు తదితర అగ్రనేతలు ఈ ప్రదర్శనను ముందుండి నడిపించారు. గిరిజనుల ఐక్యతను చాటిచెప్పేలా సాగిన ఈ మహాసభల తొలిరోజు కార్యక్రమం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.
Admin
తెలుగు వెలుగు టీవీ