తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : - రాముడి హుండీకే శఠగోపం - పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ - యువతతోనే సమాజ మార్పు - సిపిఐ శిక్షణా తరగతుల్లో జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ ప్రజాపక్షం/భద్రాచలం : భారతీయ జనతాపార్టీ రాజకీయ పార్టీలను విభజించి లబ్ది పొందే ప్రయత్నంలో ప్రజాస్వామ్యాన్ని అవహాస్యం చేస్తోందని సిపిఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ ఆరోపించారు. 2004 ఎన్నికల్లో 300 సీట్ల కోసంప్రయత్నం చేసి భంగపడ్డ బిజేపి దేశంలోని రాజీయ పార్టీలను చీల్చి ప్రజాభిప్రాయాన్ని ప్రక్కనపెట్టి పార్లమెంట్లో ఆదిపత్యాన్ని పెంచుకునేందుకు యంపర్లాడుతోందన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా కౌన్సిల్ సభ్యుల స్థాయి రాజకీయ సైద్దాంతిక శిక్షణా తరగతులు మంగళవారం భద్రాచలంలో ప్రారంభమయ్యాయి. ఈ తరగతులకు ముందు పార్టీ పతాకాన్ని సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగం హేమంతరావు ఆవిష్కరించారు. శిక్షణా తరగతులను ప్రారంభించిన రామకృష్ణ, సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో మాట్లాడారు. పలు రాష్ట్రాల్లో విపక్షాలను చీల్చే ప్రయత్నం చేస్తూ కాశాయం పార్టీ వికృత క్రీడకు తెరలేపిందన్నారు. బెంగాళ్ లో బిజేపీ వ్యవహరించిన తీరు ప్రజా స్వామ్యానికి గొడ్డలిపెట్టుగా మారిందన్నారు. ఒకప్రక్క సర్ పేరుతో ఓట్లను తొలగిస్తూ మరో ప్రక్క రాజకీయ పార్టీలను ముక్కలు చేస్తుందని రామకృష్ణ ఆరోపించారు. బిజేపి అధికారంలోనికి రావడానికి కారణమైన రామానామాకే చివరకు శఠగోపంపెట్టే పరిస్థితి తీసుకొస్తోందన్నారు. అయోధ్య రామాలయంలో సుమారు రూ.1400 కోట్లను బిజేపి అనుబంధ సంస్థలైన విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ దారిమళ్లించాయని, దీనిపై మోడి సమాధానం చెప్పాలన్నారు. దేశవ్యాప్తంగా రూ.3624 కోట్ల విరాళాలు వచ్చాయని చెబుతున్న మత సంస్థలు దారితప్పిన నిధులపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని రామకృష్ణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. హిందూ దేవాలయాల నిధుల కైంకర్యంతో బిజేపి భక్తుల మనోభావాలను దెబ్బతీసిందన్నారు. దీనిపై బిజేపి మిత్రపక్షాలు స్పందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. బంగారు, వెండి వర్తకులు చెబుతున్నట్లుగా టన్నుల కొద్ది వచ్చిన బంగారం, వెండి పై విచారణ జరపాలన్నారు. బిజేపి నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశమని అసంబద్ద ప్రచారాన్ని ముందుకు తెచ్చిందని ఇది సరికాదన్నారు. ఒకప్రక్క దేశంలో ఆర్థికం అంతరాలు పెరుగుతున్నాయని. రూ.55 లక్షల కోట్ల అప్పు 2014లో ఉంటే, ఇప్పుడు అది రూ.230 లక్షల కోట్లకు పెరిగిందని, రూపాయి విలువ డాలర్తో పోలిస్తే కనిష్ట స్థాయికి చేరిందన్నారు. మోడి అధికారంలోకి వచ్చేనాడు ఒక డాలరుకు రూ.58 రూపాయలు ఉన్న పరిస్తితి నుండి ఇప్పుడు రూ.95కి పడిపోయిందని ఆయన చెప్పారు. 12 కోట్ల జనాభా కలిగిన జపాన్తో పోల్చుకోవడం సరికాదన్నారు. స్వారూప్యత కలిగిన చైనాతో సరిపోల్చుకున్నప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ 3.9 ట్రిలియన్ డాలర్లుగా ఉండగా, చైనాది 19 ట్రిలియన్ డాలర్లు గా ఉందని, దీనికి బిజేపి సమాధానం చెప్పాలన్నారు. బిజేపీ ఈ 12 ఏళ్ల కాలంలో ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని, ధరలు, నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతున్నాయని , తెస్తానని చప్పిన బ్లాక్ మని తీసుకురాలేదని, దేశంలోని అవినీతిని అరికడతానని అధికారంలోనికి వచ్చిన మోడి ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. బిజేపి ఇప్పుడు ఒక వివత్కర స్థితిని ఎదుర్కొంటూ అసత్య ప్రచారంతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు. మార్పు తధ్యం : ప్రపంచ వ్యాప్తంగా ప్రజల అవసరాలను గుర్తించి పాలన చేయని వారిని గద్దె దింపుతున్నారని, ఇందులో యువత ప్రధాన పాత్రపోషిస్తోందని రామకృష్ణ అన్నారు. ప్రస్తుత తరం మార్పు కోరుకుంటోందని తెలిపారు. ఇటీవల దేశంలో కాక్రోచ్ జనతా పార్టీకి వచ్చిన స్పందన తమిళనాడులో టివికే గెలుపు ఇవన్నీ మార్పులను సూచిస్తున్నాయన్నారు. కొత్తగూడెంలో ఒక సానుకూల పరిణామం తొలి మేయర్ గెలిచేందుకు కారణమైందని, అలాంటి పరిస్థితులే దేశంలో పునరావృతం కానున్నాయన్నారు. పెరిగిన నిరుద్యోగం , అవినీతి ఆర్థిక అంతరాలు రానున్న కాలంలో మార్పుకు దారితీస్తాయని ఆయన తెలిపారు. నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్లో లో వచ్చిన పరిణామాలు భారత్లో కూడా రానున్నాయన్నారు. యువత విద్యార్థులను ఆకర్షించడం ద్వారా ముందుకు సాగాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు. బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ : పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించడం జరిగిందని రామకృష్ణ తెలిపారు. ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పోరాటాలు చేసేందుకు ఆగస్టు 6 తేది నుండి 15 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామగ్రామాన పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 1న ప్రస్తుతం బిజేపి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ చలో డిల్లీ పిలుపునిచ్చామని ఆయన తెలిపారు. తొలిరోజు శిక్షణ తరగతుల్లో మార్క్సిజం సమకాలీన సమాజంలో దాని ప్రాధాన్యత అనే అంశాన్ని ప్రొ యుగల్ రాయల్, తీవ్ర ఆర్థిక సంక్షోబంలో భారదేశం అనే అంశాన్ని బివి మోహన్ రెడ్డి బోధించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా, కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, సిపిఐ రాష్ట్ర నాయకులు ముత్యాల విశ్వనాధం, జమ్ముల జితేందర్ రెడ్డి, కల్లూరి వెంకటేశ్వరరావు, ఎర్రా బాబు, నరాటి ప్రసాద్, సరెడ్డి పుల్లారెడ్డి, ఎస్కే జానీమియా, మున్నా లక్ష్మీ కుమారి, ఏవూరి లతాదేవి, గోవిందరావు, ఎస్టి సలీం, సలిగంటి శ్రీనివాస్, చండ్ర నరేంద్ర, కర్ణకుమార్, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ