తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సాయుధ రైతాంగ పోరాటం అజరామరం నయా రాచరిక పాలకులపై ఉద్యమిద్దాం సాయుధ పోరాటంలో కాషాయ పాత్ర శూన్యం సమరశీల పోరాటాలతో అమరుల ఆశయాలు సాధిద్దాం : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్ర అజరామరమైనదని, నాడు సాగిన వీరోచిత పోరాటాల స్ఫూర్తితో నేటి నయా రాచరిక పాలకులపై ఉద్యమించాల్సిన అవసరం ఉందని సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. చారిత్రక తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల ప్రారంభ సభ శుక్రవారం సుజాతనగర్ మండలం నాయకులగూడెం గ్రామంలో జరిగింది. పోరాటానికి పిలుపునిచ్చిన నేత రావి నారాయణరెడ్డి స్థూపం వద్ద పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం ఎర్రజెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభలో సాబీర్ పాషా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నిజాం నవాబు నిరంకుశ పాలనకు, దేశ్ముఖ్ల భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా సాగిన మహత్తర సాయుధ పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. వెట్టిచాకిరీ విముక్తి కోసం, భుక్తి కోసం, 'దున్నేవాడికే భూమి' హక్కు కోసం వేలాది మంది కమ్యూనిస్టు యోధులు రక్తతర్పణం చేసి పేదలకు భూములను పంచిపెట్టారని గుర్తుచేశారు. ఆనాడు కమ్యూనిస్టుల రక్తంతో లిఖించబడిన మహోజ్వల పోరాట చరిత్రలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ల పాత్ర ఇసుమంత కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. నాడు నయాపైసా త్యాగం చేయని మితవాద శక్తులు, నేడు సాయుధ పోరాటాన్ని హైజాక్ చేసేందుకు తెగబడుతుండటం సిగ్గుచేటన్నారు. వర్గ పోరాటాన్ని హిందూ–ముస్లిం గొడవగా చిత్రీకరిస్తూ, చరిత్రను వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. అమరుల ఆశయాలు నేటికీ నెరవేరలేదని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజాస్వామ్య రక్షణ కోసం సమరశీల ఉద్యమాలను నిర్మించాలని కోరారు. అనంతరం నాయకులగూడెంలోని సాయుధ పోరాట యోధులు కొమారి రామయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కొమారి హన్మంతరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాధం, మేయర్ మూడ్ గణేష్, రాష్ట్ర సమితి సభ్యులు సలిగంటి శ్రీనివాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు వి పూర్ణచందర్ రావు, కంచర్ల జమలయ్య, వాసిరెడ్డి మురళి, జి వీరాస్వామి, కందుల భాస్కర్, భూక్య దస్రు, జిల్లా సమితి సభ్యులు జక్కుల రాములు, భూక్య శ్రీనివాస్, కె రత్నకుమారి, వర్క అజిత్, నాయకులు ఎండి యూసుఫ్, సత్యనారాయణ చారి, దండు నాగేశ్వర్ రావు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు భూక్యా శాంతిశ్రీ, బోయిన విజయ్ కుమార్, బండి నర్సింహా, దుర్గయ్య, నిమ్మల రాంబాబు, వై ఎస్ గిరి, మల్లేష్, కేశవరావు, పొదిలి శ్రీను, గోరెంట్ల ధర్మ, కున్సోత్ శంకర్, కొమారి కృష్ణ, షాహీన్, మేదిని లక్ష్మి, కైసర్, షమీమ్, శ్రీను, రమేష్, కత్తి వెంకన్న, బాలు, లక్ష్మయ్య, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ