తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా రేపు నిర్వహించు సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్లకు నిర్వహించనున్న శిక్షణ కార్యక్రమంపై జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు .నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సహా ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పూర్తి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందువల్ల ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రజలకు లబ్ధి చేకూర్చే వివిధ పథకాలు, వాటి అమలు విధానం, లబ్ధిదారులు వాటిని ఎలా పొందగలరు వంటి అంశాలపై సమగ్రంగా వివరించాలని అధికారులను ఆదేశించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రజా ప్రతినిధుల పాత్రపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు 99 రోజుల ప్రజాపాలన కార్యాచరణ ప్రణాళికపై కూడా పూర్తి వివరాలు తెలియజేయాలని సూచించారు.ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్న 10 ప్రధాన అంశాలు, వాటి ప్రాధాన్యతను ప్రజా ప్రతినిధులకు వివరించాలని తెలిపారు. మహిళలు, పిల్లల సంరక్షణకు సంబంధించిన చట్టాలు, హెల్ప్లైన్ నంబర్లు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, ఉచిత విద్యుత్ సదుపాయం,మహాలక్ష్మి పథకం,అలాగే విద్య, వైద్య శాఖల ద్వారా అమలు చేస్తున్న నూతన విధానాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామాల వారీగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ద్వారా ఎంతమంది లబ్ధిదారులు ప్రయోజనం పొందుతున్నారో సంబంధిత వివరాలు కూడా అందించాలని సూచించారు.శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమానికి తగిన సౌండ్ సిస్టమ్, ఎల్ఈడి స్క్రీన్లు, భోజనం, అల్పాహారం, స్నాక్స్ తదితర ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండేలా చూడాలని చెప్పారు. వైద్య శాఖ ఆధ్వర్యంలో ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధుల కోసం ప్రత్యేక రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసి వారికి ఐడి కార్డులు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ