తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భావప్రకటనా స్వేచ్ఛ పరిరక్షణే ముఖ్యం. ద్వేషపూరిత ప్రసంగాల నియంత్రణ అవసరం. సహజ న్యాయసూత్రాలకు భంగం కలగొద్దు.సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.ప్రజాస్వామ్యంలో భావప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలగకుండా ద్వేషపూరిత ప్రసంగాల నిరోధక బిల్లులో అవసరమైన మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరం ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ద్వేషపూరిత ప్రసంగాలు, ద్వేషపూరిత నేరాల (నిరోధక) బిల్లు - 2026పై అసెంబ్లీ స్పీకర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక సెలెక్ట్ కమిటీ తొలి సమావేశం శనివారం హైదరాబాద్లో జరిగింది. కమిటీ చైర్మన్, మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సభ్యునిగా పాల్గొన్న కూనంనేని సాంబశివరావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ద్వేషపూరిత వ్యాఖ్యలను అరికట్టే క్రమంలో సాధారణ పౌరుల రాజకీయ విమర్శలకు, భావప్రకటనా స్వేచ్ఛకు భంగం వాటిల్లకుండా స్పష్టమైన సరిహద్దులు నిర్ణయించాలని సూచించారు. బిల్లులోని ద్వేషపూరిత ప్రసంగాల నిర్వచనం, శిక్షలు, జరిమానాలు, డిజిటల్ మీడియా నియంత్రణ నిబంధనలను క్షుణ్ణంగా సమీక్షించాల్సి ఉందన్నారు. ముఖ్యంగా సాహిత్యం, కళలు, పరిశోధనలు, సమాజ హితం కోసం చేసే విమర్శలకు ఈ చట్టం నుండి మినహాయింపు ఇచ్చేలా సహజ న్యాయసూత్రాలను పొందుపరచాలన్నారు. వర్షాకాల సమావేశాలు ముగిసేలోపు అన్ని పక్షాల అభిప్రాయాలతో సమగ్ర నివేదికను శాసనసభకు సమర్పిస్తామని ఆయన స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ