తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : వచ్చే వర్షాకాలానికే బేతుపల్లి చెరువుకు గోదావరి జలాలు చేరాలి డిస్ట్రిబ్యూటరీ కాలువల భూసేకరణలో రైతులు, ప్రజాప్రతినిధులు సహకరించాలి యాతాలకుంట టన్నెల్ ను పరిశీలించిన మంత్రి తుమ్మల ఆగస్టు 15లోపు యాతాలకుంట టన్నెల్ లైనింగ్ పనులను ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామంలో నిర్మాణంలో ఉన్న యాతాలకుంట టన్నెల్ ను సోమవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించి పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు అంకిత్,దివాకర్ టిఎస్, , అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ లను వెంట తీసుకొని మంత్రి స్వయంగా ట్రాక్టర్ నడుపుకుంటూ టన్నెల్ లోపలికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు అందించడం ఇక్కడి ప్రజల చిరకాల స్వప్నమని అన్నారు. ఏటూరునాగారం నుంచి పాపికొండల వరకు గోదావరి పరివాహక ప్రాంతం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆ జలాలను వినియోగించు కోలేకపోయామని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఖమ్మం సరిహద్దుల వరకు వచ్చినా సిల్ట్ సమస్యలు, ఇతర ప్రాంతాల ఆయకట్టు కారణంగా జిల్లాకు నీరు అందలేదని అన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ కొంత మేర ఉపశమనం ఇచ్చినా, ఖమ్మం జిల్లా ఎత్తైన ప్రాంతంలో ఉండటంతో గోదావరి జలాలను వినియోగించుకోవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ మాత్రమే మార్గమని తెలిపారు. ఎన్టీఆర్ హయాం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ప్రతి ముఖ్యమంత్రిని ఖమ్మం జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ మంజూరు చేయాలని కోరుతూ పోరాడానని అన్నారు . 1997-98లో నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం రైట్ లైన్ కెనాల్ వరకు లిఫ్ట్ పనులను రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేశామని, అదే సమయంలో దేవాదుల, దుమ్ముగూడెం లిఫ్ట్ ప్రాజెక్టులను ప్రతిపాదించామని తెలిపారు. నిధుల కొరత కారణంగా అప్పట్లో దేవాదుల ప్రాజెక్ట్ మాత్రమే ప్రారంభమైందన్నారు. వైఎస్సార్ హయాంలో దుమ్ముగూడెం ప్రాజెక్టును ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ పేర్లతో తీసుకువచ్చారని, రాష్ట్ర విభజన అనంతరం ఇందిరాసాగర్ హెడ్వర్క్స్ ఆంధ్రప్రదేశ్కు వెళ్లిపోవడంతో పాటు అవసరమైన అనుమతులు కూడా లేకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం అప్పటి ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి దుమ్ముగూడెం ప్రాజెక్టును ముందుకు తీసుకువచ్చామని, ఈ ప్రాంతానికి శ్రీ సీతారాములతో ఉన్న అనుబంధం కారణంగా దీనికి సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టామని తెలిపారు. 2016లో 13 వేల కోట్ల పరిపాలనా అనుమతులు వచ్చినప్పటికీ గత ప్రభుత్వ హయాంలో పనులు చాలా నెమ్మదిగా సాగాయని అన్నారు. 100 కిలోమీటర్ల ప్రధాన కాలువ, మూడు పంప్ హౌస్లు మాత్రమే పూర్తయ్యాయని, ప్రస్తుతం నాలుగో పంప్ హౌస్ పనులు కొనసాగు తున్నాయని, వాటిని పూర్తి చేస్తామని చెప్పారు. సత్తుపల్లి ట్రంక్లో భాగమైన యాతాలకుంట టన్నెల్ ద్వారానే ప్రధాన కాలువ నుంచి నీరు సరఫరా అవుతుందని వివరించారు. గత ప్రభుత్వం టన్నెల్ నిర్మించాలా, పైపులైన్ వేయాలా అనే విషయంలో నిర్ణయం తీసుకోలేదని, భద్రాచలం పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకువచ్చి పెండింగ్ పనులను ప్రారంభించామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై 10 వేల కోట్లు ఖర్చు చేశామని, మరో 7 నుంచి 8 వేల కోట్లు వెచ్చిస్తే కాలువల పనులు పూర్తి చేసి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో పూర్తి చేయవచ్చని అన్నారు . రాజీవ్ లింక్ కాలువను ఆరు నెలల్లో పూర్తి చేశామని, వచ్చే జూన్ నాటికి గోదావరి జలాలతో వైరా ప్రాజెక్టును నింపి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. యాతాలకుంట టన్నెల్ పూర్తైతే మరో లక్ష ఎకరాలకు గోదావరి జలాలు అందుతాయని పేర్కొన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులు 16 నెలల క్రితం ప్రారంభమై, ఏజెన్సీ అధికారులు రాత్రింబవళ్లు కష్టపడి టన్నెల్ నిర్మాణాన్ని పూర్తి చేశారని అభినందించారు. టన్నెల్ లైనింగ్ పనులను కూడా త్వరగా పూర్తి చేయాలని, రెండు వైపులా పనులు వేగవంతం చేయాలని సూచించారు. వచ్చే వర్షాకాలానికే యాతాలకుంట టన్నెల్ ద్వారా గోదావరి జలాలు బేతుపల్లి చెరువుకు చేరాలనేది తన కోరిక అని అన్నారు. ప్రధాన కాలువ భూసేకరణ పూర్తి చేసిన కలెక్టర్ లకు మంత్రి అభినందనలు తెలిపారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల కోసం ఇంకా 11వేల ఎకరాల భూమి అవసరమని, భూసేకరణపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వం డిస్ట్రిబ్యూటరీ కాలువలను నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం సవరించిన అంచనాలకు ఆమోదం తెలిపిందని తెలిపారు. మొదట పినపాక, తరువాత కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాలకు ఈ ఏడాదిలోనే ప్రయోజనం చేకూరుతుందని, కాలువల పనులు త్వరగా పూర్తవ్వాలంటే ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు రైతులతో సమన్వయం చేసి భూసేకరణకు సహకరించాలని కోరారు. యాతాలకుంట టన్నెల్ లైనింగ్ పనులు ఆగస్టు 15లోపు పూర్తి చేయాలని, ఏ సమస్య వచ్చినా వెంటనే ఎమ్మెల్యేలు, కలెక్టర్ల దృష్టికి తీసుకురావాలని ఏజెన్సీకి సూచించారు. భూమి ఇచ్చిన రైతులకు మంచి పరిహారం అందిస్తున్నామని, ప్రాజెక్ట్ కోసం రైతులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మొత్తం 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని, జూలూరుపాడు టన్నెల్ పూర్తైతే పాలేరు వరకు గోదావరి జలాలు చేరుతాయని, ఖమ్మం జిల్లాలో మొత్తం 10 లక్షల ఎకరాలు సాగునీటి పరిధిలోకి వస్తాయని మంత్రి తెలిపారు. జూలూరుపాడు టన్నెల్ టెండర్ ప్రక్రియ పూర్తయ్యిందని, యాతాలకుంట టన్నెల్ లైనింగ్ అనంతరం జూలూరుపాడు టన్నెల్ పనులు వేగవంతం అవుతాయని అన్నారు. భూసేకరణ సమస్యలను త్వరగా పరిష్కరించి పనులు పూర్తి చేయాలని సూచించారు. డిస్ట్రిబ్యూటరీ కాలువల పనులు స్థానిక ఎమ్మెల్యేలు, రైతుల సహకారంపైనే ఆధారపడి ఉన్నాయని చెప్పారు. గోదావరి జలాలు అందితే ఆయిల్పామ్ సాగు విస్తృతంగా పెరుగుతుందని, రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందని మంత్రి తెలిపారు. ఉద్యాన పంటలకు తక్కువ నీరు సరిపోతుందని, ఒక ఎకరం వరి సాగు నీటితో ఐదు ఎకరాల ఆయిల్పామ్ సాగు సాధ్యమవుతుందని అన్నారు . వరి సాగులో ఎరువులు, మార్కెటింగ్, అకాల వర్షాలు రైతులను ఇబ్బంది పెడుతున్నాయని అన్నారు. దేశంలో ప్రతి పంటను కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, వరి, మొక్కజొన్న, జొన్నలు, సన్ఫ్లవర్ వంటి పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ధాన్యం కొనుగోళ్లు ఆలస్యమవుతున్నా యని విమర్శించారు. డీజిల్ సరఫరా, హమాలీల కొరత, గన్నీ బ్యాగుల సరఫరా తగ్గినా తెలంగాణ దేశంలో అత్యధిక ధాన్యం కొనుగోలు చేస్తున్న రాష్ట్రంగా నిలిచిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ధర ప్రకటిస్తోందే తప్ప పంటలను కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. రైతుల సమస్యలను రాజకీయాలకు ఉపయోగించు కోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఏసిపి వసుంధర, ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, రైతులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ