తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ హైదరాబాద్ సంస్థానం నిజాం పాలనలో కొనసాగిందని పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో నిర్వహించిన ఆపరేషన్ పోలో చర్య వలన 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్ లో విలీనం చేయబడింది అని పేర్కొన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజాపాలనలో ప్రజల భాగస్వామ్యం, పారదర్శకత, జవాబుదారీతనం ఎంతో కీలకమని అన్నారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ పోలీసు శాఖ ప్రధాన బాధ్యత అని పేర్కొంటూ, ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను సత్వరం పరిష్కరించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజా సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ