తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : లక్ష్మీదేవిపల్లి మండలం గట్టు మల్ల గ్రామ పరిధిలోని వ్యవసాయ భూమిలో అక్రమంగా ప్రవేశించి పంటను ధ్వంసం చేయడం, బలవంతంగా పామాయిల్ మొక్కలు నాటడం, భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించడం, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ డిమాండ్ చేశారు.ఈ మేరకు బాధిత రైతు భట్టు హరి తరఫున జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు సమర్పించారు. కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో లేకపోవడంతో ఫిర్యాదు కాపీని A.O. రామకృష్ణకి అందజేశారు.గట్టు మల్ల గ్రామ పరిధిలోని సర్వే నం. 120లో 9.01 ఎకరాలు, సర్వే నం. 119/A/1లో 1.01 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించి భట్టు శ్రీనివాస్ పేరుపై పట్టా పాస్బుక్లు, భూ రికార్డులు ఉన్నాయని తెలిపారు. భట్టు శ్రీనివాస్ విదేశాల్లో ఉద్యోగ విధులు నిర్వహిస్తున్నందున, తన మేనల్లుడు భట్టు హరికి 25-06-2025న Special Power of Attorney (SPA) ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.గతంలో భూమిలో బోరు వేస్తున్న సమయంలో అడ్డుకోవడం, బోరులో రాళ్లు వేయడం, కేసింగ్ పైపులను ధ్వంసం చేయడం, ఫెన్సింగ్ను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరిగినట్లు తెలిపారు. ఈ ఘటనలపై లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో పాటు, గతంలో SC/ST (Prevention of Atrocities) Act కింద కేసు కూడా నమోదు అయినట్లు వెల్లడించారు. అలాగే 24-03-2026న అదే వ్యవసాయ భూమిలో మృతదేహాన్ని దహనం చేసిన ఘటనపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.ఇటీవల సుమారు 40–50 మంది వ్యక్తులను భూమి వద్దకు తీసుకువచ్చి, పత్తి పంటను ట్రాక్టర్తో దున్ని నాశనం చేయడంతో పాటు, భూ యజమాని అనుమతి లేకుండా పామాయిల్ మొక్కలను నాటినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు దాడికి ప్రయత్నిస్తూ, ప్రాణహాని కలిగించే విధంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకులు భూక్యా సీతారాం నాయక్ మాట్లాడుతూ, భట్టు శ్రీనివాస్ భూములను అక్రమంగా ఆక్రమించుకునే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అన్నారు. రెవెన్యూ రికార్డులను సమగ్రంగా పరిశీలించి వాస్తవ హక్కుదారులను నిర్ధారించాలని, పంట నష్టం, అక్రమ ప్రవేశం తదితర అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను కోరారు.బాధిత రైతు కుటుంబానికి తక్షణ పోలీసు రక్షణ కల్పించి, భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పంటలను ధ్వంసం చేయడం, బలవంతంగా మొక్కలు నాటడం వంటి చర్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికే పోలీస్, రెవెన్యూ శాఖలకు అందించిన ఫిర్యాదులపై సమీక్ష నిర్వహించి, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను కోరారు. భట్టు శ్రీనివాస్ భూమి విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేయకుండా, వాస్తవ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితుడికి న్యాయం చేయాలి. భూమి హక్కులు, శాంతిభద్రతలను కాపాడటం ప్రభుత్వ అధికారుల బాధ్యత. అధికారులు స్పందించి న్యాయం చేయని పక్షంలో బంజారా బిడ్డలను ఏకం చేసి, మా బంజారా బిడ్డ భట్టు శ్రీనివాస్ భూమిని కాపాడుకునేందుకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం అని భూక్యా సీతారాం నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ములకలపల్లి మండల అధ్యక్షులు గుగులోత్ శంకర్ నాయక్, భట్టు నరేష్ నాయక్, భట్టు వీరన్న నాయక్, భట్టు హరి నాయక్, బానోత్ సందీప్ నాయక్, బానోత్ సతీష్ నాయక్, భట్టు తేజ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ