తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి పారదర్శకమైన, తప్పుల్లేని ఓటరు జాబితాను రూపొందించాలి 18 ఏళ్లు నిండిన వారిని ఓటర్లుగా నమోదు చేయించాలి ఎన్నికల అధికారులకు బిఎల్ఏలు పూర్తి సహకారం అందించాలి : సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా ఎస్ఐఆర్ ప్రక్రియలో పార్టీ శ్రేణులు, బిఎల్ఏలు క్రియాశీలకంగా పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా పిలుపునిచ్చారు. పారదర్శకమైన, తప్పుల్లేని ఓటరు జాబితా రూపకల్పనకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపై స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు అవగాహన కల్పించేందుకు సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో మంగళవారం చుంచుపల్లి మండల పరిధిలోని గౌతంపూర్, రుద్రంపూర్, పెనగడప గ్రామాల్లో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సులకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్ కె సాబీర్ పాషా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన సాధనమని, అర్హులైన పౌరులెవరూ ఓటరుగా నమోదు కాకుండా ఉండిపోకూడదని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయించడమే కాకుండా, ప్రస్తుతం ఉన్న ఓటర్ల ఓటు హక్కు రద్దు కాకుండా బిఎల్ఏలు (బూత్ లెవల్ ఏజెంట్లు) ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. ఓటర్ల జాబితాలోని తప్పుల సవరణ, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామాల మార్పు వంటి అంశాలను బిఎల్ఏలు నిరంతరం పర్యవేక్షిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న బిఎల్ఓలు, ఎన్నికల సిబ్బందికి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలిచి సహకరించాలని కోరారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేసి, పారదర్శకమైన జాబితా తయారీ ద్వారానే ప్రజాస్వామ్యం మరింత పరిపుష్టమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ అవగాహన సదస్సుల్లో మేయర్ మూడ్ గణేష్, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, గానగళ్ల వీరాస్వామి, వట్టికొండ మల్లికార్జున్ రావు, తోట రాజు, కె రాములు, నీడలా సుధాకర్, వెంకన్న, కట్ట ఉదయ్, జగదాంబ, తాజుద్దీన్, సర్పంచ్ కళ్యాణి, సీతారాములు, బివి రమణ, బండారి మల్లయ్య, లక్ష్మణ్, గంగారాం, కొవ్వూరి రాజేశ్వరరావు, గుడిపూడి రవి, జోసెఫ్, బిక్షపతి, గిరిజాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ