తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో, దుమ్ముగూడెం మండలం పర్వతాల, పెద్దనల్లబల్లి, ప్రగలపల్లి గ్రామ పంచాయతీలు, చెర్ల మండలం దేవరపల్లి, ఆర్.కొత్తగూడెం, పెద్దమిడసలేరు గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను సాధారణ ఎన్నికల పరిశీలకులు సర్వేశ్వర్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. పరిశీలనలో ప్రతి కేంద్రంలో అభ్యర్థుల సౌకర్యాలు, కేంద్ర పరిసరాల శుభ్రత, ధృవపత్రాల సమర్పణ విధానం, సిబ్బంది సమర్థత, వరుసల ఏర్పాట్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా, సర్వేశ్వర్ రెడ్డి, గ్రామ పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ధతో తమ విధులు నిర్వహించాలన్నారు. అభ్యర్థులు తమ దాఖలాలను నియమావళి ప్రకారం సమర్పించడం, కేంద్ర సిబ్బంది ప్రతి దశలో సమర్థంగా విధులు నిర్వర్తించడం ద్వారా, జిల్లా మొత్తం నామినేషన్ ప్రక్రియ సక్రమంగా, సమస్యలు లేకుండా సాగుతుందని పరిశీలకులు అన్నారు. ఈ పరిశీలనలో సంబంధిత మండలాల ఎంపీడీవోలు తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ