తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జెడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు మరియు రాజకీయ పార్టీలు ఖర్చు చేయగల వ్యయ పరిమితులను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈఓ నాగలక్ష్మి మరియు డీపిఒ రాంబాబు సోమవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులతో ఎన్నికల ఖర్చు పరిమితులు మరియు వ్యయ పర్యవేక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.సమావేశంలో మాట్లాడిన సీఈఓ నాగలక్ష్మి మాట్లాడుతూ, అభ్యర్థులు ఎన్నికల ఖర్చు పరిమితులను తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన ప్రకారం జెడ్పిటిసి అభ్యర్థులు రూ.4 లక్షలు, ఎంపీటీసీ అభ్యర్థులు రూ.1.50 లక్షలు వరకు, సర్పంచ్ అభ్యర్థులు గ్రామపంచాయతీ జనాభా ఆధారంగా రూ.2.50 లక్షలు లేదా రూ.1.50 లక్షల వరకు వ్యయం చేయవచ్చని తెలిపారు.2011 జనాభా లెక్కల ప్రకారం 5 వేల జనాభా కంటే ఎక్కువ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి రూ.2.50 లక్షలు, వార్డు సభ్య అభ్యర్థికి రూ.50,000ల వ్యయ పరిమితి, 5 వేల జనాభా కంటే తక్కువ ఉన్న గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి రూ.1.50 లక్షలు, వార్డు సభ్య అభ్యర్థికి రూ.30,000ల వ్యయ పరిమితి ఉంటుందని వివరించారు.డీపిఒ రాంబాబు మాట్లాడుతూ, అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతంలో రాజకీయ పార్టీలు చేసే ప్రచార ఖర్చులు కూడా ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖాతాలో చేర్చబడతాయని తెలిపారు. ప్రచారంలో వాహనాలు, మైక్ సెట్లు, పోస్టర్లు, బ్యానర్లు, పాంప్లెట్లు మొదలైన వాటి ఖర్చులు కూడా లెక్కలో చూపించాలని సూచించారు.ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థి ఎన్నికల అనంతరం 45 రోజుల్లోపు తమ తుది ఖర్చు నివేదికలను సంబంధిత నియామక అధికారికి సమర్పించాల్సి ఉంటుందని తెలిపారు.ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా సాగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని, ఖర్చు పర్యవేక్షణ కమిటీలు, వీడియో సర్వైలెన్స్ టీములు కఠినంగా పర్యవేక్షణ జరపనున్నాయని తెలిపారు.ఈ సమావేశంలో డిప్యూటీ జెడ్పి సీఈవో చంద్రశేఖర్,ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లక్ష్మణ్ అగర్వాల్, భారతీయ రాష్ట్ర సమి తి అనుదీప్, సిపిఐ పార్టీ శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ నోముల రమేష్, సిపిఐ ( ఎం) సత్యనారాయణ మరియు సిపిఐ ( ఎం సి ) గౌరీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ