తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు టేకులపల్లి మండలం లచ్చ గూడెం గ్రామంలో నిర్వహించిన గ్రామ పంచాయతీ స్థాయి సెట్యురేషన్ క్యాంప్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఘనశ్యాం సోలంకి పాల్గొన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం అన్ని గ్రామ పంచాయతీలలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని, ప్రధాన మంత్రి జన్ ధన్ ఖాతాలు తెరవడం, జీవనజ్యోతి భీమా యోజన, సురక్ష భీమా యోజన, అటల్ పెన్షన్ యోజన పథకాల గురించి అవగాహన కల్పించి నమోదు చేయడం, కె. వై.సి. నమోదు, నామినేషన్ సౌకర్యం, క్లెయిమ్ చేయని డిపాజిట్లపై అవగాహన కల్పించడం, వివిధ బ్యాంక్ పథకాల గురించి అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలియచేశారు. ఖాతా దారులకు మెరుగయిన సేవలు అందించే విషయంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని తెలియచేశారు. సత్యనారాయణ, రీజనల్ మేనేజర్ మాట్లాడుతూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నదన్నారు. మన జిల్లా కలెక్టర్ జిల్లాలోని వివిధ వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మునుపెన్నడూ లేనివిధంగా మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని, మునగ, కొరమీను పెంపకం, మేకల పెంపకం, కౌజుపిట్టల పెంపకం , పుట్టగొడుగుల పెంపకం ఇలా ప్రజల ఆదాయాన్ని పెంచే విధంగా కృషిచేస్తున్నారని, గ్రామీణ యువత కు ఉపాధి అవకాశాలు పెరిగే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ ప్రయత్నాలకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పూర్తి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా సబ్సిడీ పథకాలు కూడా అందుబాటులో ఉన్నాయని, వాటిని సక్రమంగా ఉపయోగించి ప్రజలు తమ ఆదాయాన్ని పెంచుకోవాలని, సూచించారు. పంట రుణాలు తీసుకున్న రైతులు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలని తద్వారా తక్కువ వడ్డీ ప్రయోజనం పొందవచ్చని తెలిపారు. తీసుకున్న రుణాలు సక్రమంగా చెల్లించి, రుణ చరిత్ర సరిగా ఉంచుకోవడం ద్వారా బ్యాంకుల నుండి మరిన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. రైతులకు, స్వయం సహాయక సంఘాల సభ్యులకు తమ బ్యాంక్ విరివిరిగా రుణాలు ఇస్తున్నట్లు వివరించారు. PMJJBY మరియు PMSBY పథకాలు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకాలనీ, కేవలం సంవత్సరానికి 436 రూపాయిలతో రెండు లక్షల రూపాయిల జీవిత బీమా మరియు 20 రూపాయిలతో రెండు లక్షల రూపాయిల ప్రమాద భీమా పొందవచ్చని తెలిపారు. అన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలలో ఈ పథకం పొందవచ్చని తెలిపారు. ప్రతి వ్యక్తి బ్యాంక్ లావాదేవీలపై అవగాహన పెంచుకుని ఆర్థికంగా దృఢంగా, సురక్షితంగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారత దేశంలోని అన్ని ప్రాంతాల్లో తమ శాఖల ద్వారా ప్రతి భారతీయుడికి బ్యాంకింగ్ సేవలు అందిస్తున్నదని, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందంజలో ఉందని తెలియచేశారు. జిల్లాలోని ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే విధంగా తమ శాఖలు మరియు వినియోగదారుల సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయని తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆదేశాల ప్రకారం ఖాతాదారులు తమ అన్ని శాఖలు మరియు వినియోగదారుల సేవా కేంద్రాల ద్వారా సులభంగా కె . వై . సి. వివరాలు నవీకరించుకోవచ్చని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వయసు గల ప్రతి వ్యక్తికి ఇన్సూరెన్స్ చేయించాలన్న లక్ష్యంతో తమ అన్ని శాఖలు పనిచేస్తున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చీఫ్ మేనేజర్ శ్రీకాంత్ , లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, మేనేజర్ (ఎఫ్.ఐ) భానుపద్మ శ్రీ , టేకులపల్లి శాఖ మేనేజర్ ముఖేష్, పంచాయతీ సెక్రటరీ కవిత, సి. యస్.పి. జిల్లా కోఆర్డినేటర్ కిషోర్ మరియు సి. యస్. పి లు , ఫ్ .ఓ. ఎస్. కృష్ణ, సి.ఎఫ్.ఎల్.కౌన్సిలర్లు నాగేశ్వరరావు, జగ్య మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ