తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఇల్లు, ఇంటి స్థలం కోసం రాష్ట్ర రాజధానికి దండుగా కదులుదాం. చలో హైదరాబాద్-ఇందిరాపార్కు ధర్నాను జయప్రదం చేయండి.నిరుపేదల సొంతింటి కల నెరవేర్చే వరకు పోరాటాలు ఆగవు. గుడిసెల కూల్చివేత చర్యలను ప్రభుత్వం మానుకోవాలి.అర్హులైన ప్రతికుటుంబానికి ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు మంజూరుచేయాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా. ఇల్లు మరియు ఇంటి స్థలం కోసం నిరుపేదలంతా ఏకమై రాష్ట్ర రాజధానికి దండుగా కదలాలని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే వరకు పోరాటాలు కొనసాగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా అన్నారు. ఇండ్లు, ఇండ్ల స్థలాల సాధన కోసం, పేదల ఇండ్ల కూల్చివేతలు నిరసనగా అదేవిధంగా పెదాలు నిర్మించుకున్న ఇండ్లకు విద్యుత్ సౌకర్యంతోపాటు ఇంటి నెంబర్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద సోమవారం నిర్వహించ తలపెట్టిన 'చలో హైదరాబాద్' ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. చుంచుపల్లి మండలం ప్రశాంత్ నగర్లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దశాబ్దాలుగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న నిరుపేదల గుడిసెల కూల్చివేత చర్యలను ప్రభుత్వం వెంటనే మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు తమ సొంత శ్రమతో నిర్మించుకున్న ఇండ్లకు తక్షణమే ఇంటి నెంబర్లు కేటాయించాలని, అలాగే విద్యుత్, తాగునీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలన్నారు. అలా కాకుండా ప్రజావ్యతిరేక విధానాలతో పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తే సహించేది లేదని హెచ్చరించారు. నిరుపేదల సొంతింటి కల నెరవేరే వరకు, ప్రతి గుడిసెకు పట్టా ఇచ్చే వరకు వామపక్షాల ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, ఈ రాజధాని ముట్టడి పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ టౌన్ కార్యదర్శి కంచర్ల జమలయ్య, నాయకులు రామవరం ఏరియా కార్యదర్శి గోపి కృష్ణ, సర్పంచి వాడె రాములు, కార్పొరేటర్ కూరపాటి సుధాకర్, నాయకులు భూక్యా శ్రీనివాస్, తూముల శ్రీనివాస్, రాజు, దార లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ