తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి : జిల్లా కలెక్టర్ అంకిత్. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలి.జిల్లాలో ఎస్సీ, ఎస్టీ చట్టం కింద నమోదైన కేసుల దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు సత్వర న్యాయం అందేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజుతో కలిసి నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల నమోదులు, దర్యాప్తు, చార్జిషీట్ల దాఖలు, కోర్టు విచారణ, బాధితులకు పరిహారం చెల్లింపులు, పునరావాస చర్యలు, పెండింగ్ కేసుల పురోగతి తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం రాష్ట్ర ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని అన్నారు. 2014 నుంచి 2026 జూలై వరకు జిల్లాలో మొత్తం 1,104 ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయని, వీటిలో 196 కేసులు తప్పుడు కేసులు గా తేలగా, 908 కేసులు నిజమైనవిగా నిర్ధారణ అయ్యాయని తెలిపారు. 859 కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేయగా, 12 కేసుల్లో శిక్షలు నమోదయ్యాయని, 373 కేసుల్లో నిందితులు నిర్దోషులుగా విడుదల కాగా, 472 కేసులు కోర్టు విచారణ దశలో ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం 49 కేసులు దర్యాప్తు దశలో కొనసాగుతున్నాయని తెలిపారు.దర్యాప్తులో ఉన్న ప్రతి కేసును నాణ్యతతో, వేగవంతంగా పూర్తి చేసి చట్టపరమైన గడువులోపు చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కేసుల విచారణలో నిర్లక్ష్యానికి తావులేకుండా బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం కల్పించే ఆర్థిక సహాయం, పునరావాసం, న్యాయ సహాయం, రక్షణ తదితర సంక్షేమ ప్రయోజనాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేసుల పురోగతిని నిరంతరం సమీక్షిస్తూ పెండింగ్ కేసులను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని, బాధితుల గోప్యత, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. గ్రామ, మండల స్థాయిలో ఎస్సీ, ఎస్టీ హక్కులు, అత్యాచారాల నిరోధక చట్టంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సమాజంలో చైతన్యం పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రోహిత్ రాజు మాట్లాడుతూ , ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్ కేసులను వేగంగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. 2016 నుంచి అమలులో ఉన్న మూడు దశల పరిహార విధానం ప్రకారం, ఎఫ్ఐఆర్ నమోదైన 949 కేసుల్లో 928 కేసులకు జిల్లా కలెక్టర్ ఆమోదం లభించగా, 823 కేసులకు పరిహారం మంజూరైందని, 105 కేసులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. చార్జిషీట్లు దాఖలైన 702 కేసుల్లో 580 కేసులకు పరిహారం మంజూరైందని, 122 కేసులు పెండింగ్లో ఉన్నాయని, కోర్టు తీర్పు వెలువడిన 7 కేసులకు సంబంధించి అన్ని 7 కేసుల్లోనూ పరిహారం పూర్తిగా చెల్లించినట్లు వివరించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులతో పాటు పోక్సో కేసులను కూడా అత్యంత ప్రాధాన్యతతో దర్యాప్తు చేస్తూ బాధిత చిన్నారులకు అవసరమైన వైద్య, న్యాయ, కౌన్సెలింగ్ సేవలు అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రజా వేదికలలో ఎస్సీ, ఎస్టీ హక్కులు, పోక్సో చట్టం, మహిళలు, బాలల రక్షణ, సైబర్ నేరాల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు . సైబర్ మోసాలకు గురైన ప్రజలు వెంటనే 1930 సైబర్ హెల్ప్లైన్కు ఫిర్యాదు చేయడంతో పాటు సమీప పోలీసు స్టేషన్ను సంప్రదించాలని సూచించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, కొత్తగూడెం ఆర్ డి ఓ మధు, జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, జిల్లా వైద్యశాఖ అధికారి తుకారాం రాథోడ్,సంబంధిత శాఖల జిల్లా అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ , జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సామ్యా నాయక్, లకావత్ వెంకటేశ్వర్లు, లక్ష్మీ రాంబాయి, కోలూరి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ