తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎల్ నినో ప్రభావంపై ముందస్తు చర్యలు చేపట్టాలి NEET-PG పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి రాష్ట్రంలో నెలకొన్న సీజనల్ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం, ఈ నెల 30న నిర్వహించనున్న NEET-PG ప్రవేశ పరీక్ష ఏర్పాట్లు, పర్యాటక రంగ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని, తక్కువ నీటి అవసరమయ్యే పంటల సాగుతో పాటు పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఉద్యాన పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎస్ సూచించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 30న నిర్వహించనున్న NEET-PG ప్రవేశ పరీక్షకు పరీక్షా కేంద్రాల్లో విద్యుత్, తాగునీరు, భద్రత, రవాణా తదితర ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎస్ సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ టూరిజం 2047 పాలసీలో భాగంగా జిల్లాల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను గుర్తించి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పరిశుభ్రత, పర్యాటకుల సౌకర్యాలను మెరుగుపరచాలని తెలిపారు. స్పిరిచువల్, హెరిటేజ్, ఎకో, క్రాఫ్ట్స్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో గుర్తించిన 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసి తెలంగాణ బ్రాండ్ను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తరించేందుకు కృషి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, NEET-PG పరీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో జడ్పీ సీఈవో నాగలక్ష్మి, సిపిఓ సునీత, వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, భూగర్భ జల శాఖ ఏడి రమేష్, జిల్లా క్రీడా శాఖ అధికారి పరంధామ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ శాఖ అధికారి వెంకటేశ్వర్లు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ