తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చిట్టిరామవరం తండాలో డిజిటల్ భూ రీ సర్వే పనుల పరిశీలన కొత్తగూడెం మండలం చిట్టిరామవరం తండాలో జరుగుతున్న భూ రీ సర్వే పనులను శుక్రవారం అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలను వినియోగిస్తూ చేపడుతున్న డిజిటల్ భూ రీ సర్వే ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్, సర్వేలో అనుసరిస్తున్న విధానం, భూముల కొలతలు, వివరాల నమోదు తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పూర్తయిన సర్వే పనుల పురోగతిపై సమీక్షించి, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సూచించారు.అనంతరం స్థానిక రైతులతో అదనపు కలెక్టర్ నేరుగా మాట్లాడి భూ రీ సర్వేకు సంబంధించి వారి అభిప్రాయాలు, సమస్యలు, సందేహాలను అడిగి తెలుసుకున్నారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూములకు సంబంధించిన వివరాలను అధికారులకు అందించి సహకరించాలని కోరారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న రీ సర్వే ద్వారా భూముల వివరాలు మరింత కచ్చితంగా నమోదు కావడంతో పాటు భవిష్యత్లో భూ సంబంధిత సమస్యలను తగ్గించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రీ సర్వే ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేలా సహకరించాలని అదనపు కలెక్టర్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, కార్పొరేటర్ డాక్టర్ స్వప్న, సర్వేయర్లు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ