తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా స్థాయి పర్యావరణ పరిరక్షణ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, డీఆర్ఓ పద్మావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ఒక శాఖ బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి వ్యక్తి బాధ్యతగా భావించి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ మార్పులు, పెరుగుతున్న కాలుష్యం, సహజ వనరుల క్షీణత వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు . ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చేపట్టనున్న కార్యక్రమాలను గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జూన్ 1 నుండి 12 వరకు జిల్లావ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలు ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించేలా ఉండాలని, ప్రతి గ్రామం, విద్యాసంస్థలు , ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని సూచించారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని, నాటిన ప్రతి మొక్కను పెంచి పెద్ద చెట్టుగా తీర్చిదిద్దినప్పుడే కార్యక్రమం విజయవంతమవుతుందని అన్నారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. కార్యక్రమం విజయవంతం కావడానికి అన్ని శాఖల అధికారులు తమ తమ పరిధిలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాకు 55 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఆ లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 50 శాతానికి పైగా అటవీ విస్తీర్ణం ఉందని, అన్ని శాఖల సమన్వయంతో గత రెండు సంవత్సరాలుగా ఒక్క ఎకరం పోడు భూమి కూడా నరికివేయకుండా సంరక్షించగలిగామని తెలిపారు. జిల్లాలో పామాయిల్, జామాయిల్, వెదురు తదితర పంటల సాగు విస్తరించడంతో జిల్లా పచ్చదనంతో కళకళలాడుతోందని, రాష్ట్రంలో పచ్చదన పరిరక్షణలో జిల్లా రెండో స్థానంలో నిలిచిందని తెలిపారు . ఈ సందర్భంగా ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా రూపొందించిన పర్యావరణ పరిరక్షణ గోడపత్రికను జిల్లా కలెక్టర్ అంకిత్ ఆవిష్కరించారు. అనంతరం అటవీ శాఖ సిబ్బంది విధుల నిర్వహణలో భద్రతకు ఉపయోగపడే సేఫ్టీ కిట్లను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సమావేశంలో అటవీ శాఖ అధికారులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ