తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకుడు డా. గడల శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గడ్డపై జనసేన పార్టీ పురుడు పోసుకుందని, తెలంగాణ బిడ్డగా ప్రజల ఆశీర్వాదాలు కోరుకుంటున్నారు అనిఅన్నారు. గిరిజన మారుమూల ప్రాంతం నుంచి వచ్చి మెడికల్ విద్యను అభ్యసించిన తాను ఎమ్మెల్యే, ఎంపీ పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. నీతి, నిజాయితీ, రాజకీయ జవాబుదారీతనం, ప్రజా కేంద్రీకృత పాలన నన్ను ఆకర్షించాయి. అందుకే నేను జనసేన పార్టీలో చేరాను అని ఆయన పేర్కొన్నారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే జనసేన లక్ష్యం అని అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు రాజకీయ అవకాశాలు కల్పించడంతో పాటు, ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు చట్టసభల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం దక్కేలా కృషి చేయాలని పార్టీ భావిస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి వర్గానికీ సమాన భాగస్వామ్యం ఉండాలని, సామాజిక న్యాయం మరియు సమాన అవకాశాల సాధన కోసం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన రాజకీయ వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో జనసేన రాజకీయ వేదికను ఎంచుకున్నానని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇంకా కోట్లాది మంది ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన జీవించడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం సమర్థంగా అందిస్తే కార్పొరేట్ విద్యాసంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రులు ఇంతగా విస్తరించే పరిస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు. ఒక కుటుంబంలో అనారోగ్య ఘటన జరిగినా ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఇచ్చే హామీలు అమలు కావడం లేదని, ముఖ్యంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీల అమలుపై సమీక్ష చేసుకోవాలని సూచించారు. యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాల హక్కులు, సంక్షేమం కోసం జనసేన నిరంతరం పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సక్రమంగా చేరేలా జనసేన సైనికులు పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల్లో జవాబుదారీతనం తగ్గిపోయిందని, రాజకీయ ఎకౌంటబిలిటీ లేకుండా పోయిందని విమర్శించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వ్యక్తికి రాజకీయాల్లో ఎదగాలనే ఆకాంక్ష ఉంటుందని, తాను మరింత ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో జనసేన ద్వారా రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించానని చెప్పారు. యువత పెద్ద ఎత్తున రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. సామాజిక తెలంగాణ నిర్మాణమే జనసేన లక్ష్యమని, అన్ని వర్గాల ప్రజలకు సమాన భాగస్వామ్యం కల్పించే బలమైన తెలంగాణ కోసం పనిచేస్తామని పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సామాజిక తెలంగాణ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. పవన్ కళ్యాణ్కు ప్రాంతీయ భావాలు లేవని, తెలంగాణ ప్రజలకు అవసరమైన ప్రతిసారి జనసేన అండగా నిలుస్తుందని అన్నారు. జనసేన నాయకత్వాన్ని కోరుకునే లక్షలాది మంది ప్రజలు ఉన్నారని, సమాన రాజకీయాలు నెలకొనాలని ఆకాంక్షించారు. తెలంగాణ ప్రజల సమస్యలకు ఆచరణాత్మక పరిష్కార మార్గాలు చూపిస్తూ సమగ్ర, సమానత్వ ఆధారిత సామాజిక తెలంగాణ నిర్మాణమే జనసేన ధ్యేయమని డా. గడల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ