తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బూటకపు మెడికల్ బోర్డును వెంటనే రద్దు చేసి రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలి.కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎఐటియుసి అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య.ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన మెడికల్ బోర్డు బూటకపు ప్రక్రియగా జరిగిందని, దానిని వెంటనే రద్దు చేసి గతంలో అమలు చేసిన విధానంలోనే రీ-మెడికల్ బోర్డు నిర్వహించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య డిమాండ్ చేశారు.ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ఎఐటియుసి ఇచ్చిన సమ్మె నోటీసు ఫలితంగానే యాజమాన్యం మెడికల్ బోర్డు నిర్వహించేందుకు ముందుకొచ్చిందని, అయితే 17, 18 తేదీల్లో జరిగిన బోర్డు పారదర్శకంగా జరగలేదని కార్మికుల కుటుంబాలకు భవిష్యత్తు లేకుండా చేసారని ఆరోపించారు.ఎంక్వైరీ పేరుతో దళారీల జోక్యం పెరిగిందని పేరుతో యాజమాన్యం కార్మికులను కార్మిక కుటుంబాలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికులను ఇన్వాలిడేషన్ చేయకుండా వారి కుటుంబాల జీవితాలతో యాజమాన్యం చెలగాటమాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.మెడికల్ బోర్డు జాబితాలో పేర్లు ఉన్న పలువురు కార్మికులకు కూడా కనీసం సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు.మంచానికే పరిమితమైన కార్మికులను, కాళ్ళు చేతులు లేని, గుండెకు స్టెంట్లు పడిన, కిడ్నీలు పనిచేయక యూరిన్ బ్యాగ్ తో ఉన్నవారిని సైతం మెడికల్ బోర్డు పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు.సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యులకు అనారోగ్యంతో ఉన్న కార్మికుల పరిస్థితి పూర్తిగా తెలుసని, అలా ఉన్న కార్మికులను గతంలో ముఖ్య వైద్యాధికారి పరిధిలోనే ఇన్వాలిడేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.అలాంటి విధానాన్ని పక్కనబెట్టి కార్మికులను అనవసరంగా బోర్డుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరైంది కాదన్నారు.జరిగిన ఈ బోర్డు ను వెంటనే రద్దుచేసి గతంలో అమలు చేసిన విధంగానే మెడికల్ బోర్డు తక్షణమే నిర్వహించి అనారోగ్యంతో ఉన్న అర్హులైన కార్మికులను ఇన్వాలిడేషన్ చేసి వారి వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించి కార్మిక కుటుంబాలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.అలాగే మెడికల్ బోర్డుకు ఉన్న రెండేళ్ల కాలపరిమితి నిబంధనను తొలగించి,అనారోగ్యంతో సిక్లో ఉన్న కార్మికుడు బోర్డు కు దరఖాస్తు చేసుకున్న వెంటనే ఇన్వాలిడేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. సుమారు 2000 మంది కార్మికులు మెడికల్ బోర్డ్ కై ఎదురుచూస్తున్నారని వీరికి వెంట వెంటనే నెలకు 2 సార్లు బోర్డ్ నిర్వహించి ఇన్వాలిడేషన్ చేయాలని డిమాండ్ చేశారు. మేము ప్రభుత్వాన్ని ఒప్పించామని గొప్పలు చెప్పుకున్న ఐ ఎన్ టీ యు సి సంఘం కార్మిక వర్గానికి సమాధానం చెప్పాలి. ప్రభుత్వాన్ని సాకుగా చూపుతూ యాజమాన్యం కాలయాపన చేయవద్దని హెచ్చరించిన ఆయన, కార్మికులకు న్యాయం జరగకపోతే సింగరేణి వ్యాప్తంగా ఎఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ