తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార & పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ అంకిత్లతో కలిసి అశ్వారావుపేట నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొని, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా దమ్మపేట మండలంలోని కట్కూరు, వీరభద్రునిగుంపు, పట్వారిగూడెం, మద్దులగూడెం గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహించారు. పట్వారిగూడెం గ్రామంలో రాజుపల్లి గ్రామానికి చెందిన 38 మంది డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. అనంతరం రూ.2.22 కోట్ల వ్యయంతో పట్వారిగూడెం ఆర్&బీ రోడ్డు నుండి పాకలగూడెం వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, రూ.1.93 కోట్లతో మొద్దులగూడెం ఆర్ అండ్ బి రోడ్డు నుండి రెడ్డాలపాడు వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వారావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ నిర్మాణ పనులకు, రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో మామిళ్లవారిగూడెం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదల సంక్షేమం, అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. పేద కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, సన్నబియ్యం, కొత్త రేషన్ కార్డులు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. కేవలం తొమ్మిది నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.21 వేల కోట్ల వ్యయంతో రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ అమలు చేసినట్లు తెలిపారు .అశ్వారావుపేట నియోజకవర్గానికి ప్రత్యేకంగా 4,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నామని తెలిపారు. కుల, మత, పార్టీ భేదాలకు అతీతంగా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తున్నామని, రెండో విడతలో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, ప్రతి అర్హుడికి ఇల్లు అందే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాళ్లతో కూడుకున్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలను ఆపకుండా కొనసాగిస్తున్నామని మంత్రి అన్నారు . రాష్ట్రవ్యాప్తంగా రూ.200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం చేపట్టామని, 99 పాఠశాలల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ అభివృద్ధికి రూ.3 కోట్లు మంజూరు చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు కూడా కేటాయిస్తామని చెప్పారు.మారుమూల గిరిజన ప్రాంతాలైన పూసుకుంటలో , కొండ రెడ్లు, గుత్తి కోయలు ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాలు నిర్వహించడం ద్వారా పేదల సొంతింటి కలను ప్రభుత్వం సాకారం చేసిందన్నారు. అశ్వారావుపేటలో 100 పడకల ఆసుపత్రి, నర్సింగ్ కళాశాల, ఏటీ సి కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు. పట్టణంలో స్థల సమస్య ఉన్నప్పటికీ ఐదు ఎకరాల్లో గ్రౌండ్ ప్లస్ త్రీ విధానంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు చేపట్టి స్థలం లేని పేదలకు అందజేస్తామని చెప్పారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి పేదలకు అందించడం జరిగిందన్నారు.ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి మాట్లాడుతూ రూ.200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించనున్నాయని తెలిపారు. అత్యాధునిక తరగతి గదులు, హాస్టళ్లు, క్రీడా ప్రాంగణాలు, లైబ్రరీలు, ఇతర సౌకర్యాలతో ఈ పాఠశాలలు నిర్మించబడుతున్నాయని చెప్పారు. ఈ పాఠశాలలు అందుబాటులోకి వస్తే ఉన్నత విద్య కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటకు మడమ తిప్పకుండ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 129 ఎకరాల్లో కొమరం భీమ్ అర్బన్ ఎకో పార్క్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా ప్రభుత్వం చొరవ తో 911 సర్వే నంబర్ పరిధిలో సర్వే పూర్తి అయిందని , 152 సర్వే నంబర్ పరిధిలో జాయింట్ సర్వే నిర్వహించాలని మంత్రిని కోరారు . దొంతికుంట చెరువు ఆధునికీకరణకు రూ.5.70 కోట్లతో పనులు చేపడుతున్నామని, పూసుకుంట వంటి గిరిజన ప్రాంతాల్లో 100 శాతం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు .జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నామని తెలిపారు. విశాలమైన తరగతి గదులు, ఆధునిక ప్రయోగశాలలు, డిజిటల్ లెర్నింగ్ సదుపాయాలు, క్రీడా ప్రాంగణాలు, హాస్టల్ వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, లైబ్రరీ వంటి అన్ని సౌకర్యాలతో పాఠశాల నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అన్ని శాఖల సమన్వయంతో నిరంతర పర్యవేక్షణ నిర్వహిస్తామని తెలిపారు. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అశ్వారావుపేట నియోజకవర్గ విద్యారంగ అభివృద్ధికి మైలురాయిగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, అశ్వరావుపేట మునిసిపల్ చైర్మన్ జూపల్లి శశికళ, ఆత్మ కమిటీ చైర్మన్,ప్రజాప్రతినిధులు, నిర్మాణ శాఖ పి డి సావేరామ్,జిల్లా అధికారులు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ