తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఉపాధి హామీ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ఉపాధి హామీ కూలీల సంఖ్యను పెంచి ఎక్కువ పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఎంజిఎన్ఆర్ఇజిఎస్, మహిళా స్వయం సహాయక సంఘాలు, నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం (ఎన్ఎఫ్బీఎస్), చేయూత పథకం తదితర అంశాలపై బుధవారం హైదరాబాద్ నుంచి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్, సెర్ప్ సీఈవో దివ్య అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉపాధి హామీ పనులు వేగవంతం కావడానికి సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కొత్త జాబ్ కార్డులు మంజూరు చేసి, ఉపాధి హామీ కూలీలు పూర్తి స్థాయిలో పని దినాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీం, చేయూత పథకాల లబ్ధి అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూడీఐడీ (యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ) కార్డులను అందరికీ అందేలా ప్రత్యేక ప్రచారం నిర్వహించాలని పేర్కొన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి సంబంధిత జిల్లా అధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అంకిత్ అనంతరం అధికారులతో మాట్లాడుతూ వేసవి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఉపాధి హామీ కూలీలు ఉదయం 5 గంటలకు పనిస్థలాలకు చేరుకొని విధులు నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, మహిళా సంఘ భవనాలు తదితర నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామన్నారు. మండలాల్లో నమోదైన జాబ్కార్డు కార్మికుల హాజరు శాతం పెంచి కనీసం 40 రోజుల పాటు పనుల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.జూన్ చివరి నాటికి మెటీరియల్ కాంపొనెంట్ క్రింద బుక్ చేయగల నిధులపై ఈఈలు పూర్తి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి అమలు ప్రారంభించాలని కలెక్టర్ సూచించారు. జల్ సంచయి జన్ భగీరథి పురస్కారాలను జిల్లా సాధించేలా అధికారులు కృషి చేయాలని కోరారు. చేయూత పెన్షన్ లబ్ధిదారుల లైవ్నెస్ అథెంటికేషన్ను పారదర్శకంగా నిర్వహించి నగదు పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. దివ్యాంగుల సదరం కేంద్రాల్లో సౌండ్ ప్రూఫ్ పరికరాలు, ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అమలులో అర్హులైన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చూడాలని సూచించారు.ఈ సమావేశంలో డిఆర్డిఓ విద్యాచందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, పంచాయతీరాజ్ ఈఈ శ్రీనివాస్, కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత, ఎంపీడీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ