తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విపత్తులపై సరైన అవగాహనతో పాటు ముందస్తు సన్నద్ధత ఉంటేనే ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. సామాజిక చైతన్యం లక్ష్యంగా జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో జిల్లాలో నిర్వహించనున్న ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ (ఫామెక్స్)–2026 కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని ఆమె సూచించారు.సోమవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఎన్డీఆర్ఎఫ్ ఫామెక్స్–2026 నిర్వహణపై జిల్లా స్థాయి సమన్వయ శాఖల అధికారులతో, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలసి జిల్లా కలెక్టర్ అంకిత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ బిటన్ సింగ్ సారథ్యంలో బృంద సభ్యులు పాల్గొన్నారు.జిల్లా భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరదలు వంటి విపత్తులకు గురయ్యే ప్రాంతాలను గుర్తించడం, ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన ముందస్తు చర్యలు, జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక (డీడీఎంపీ) అమలు, రెవెన్యూ, అగ్నిమాపక, పంచాయతీరాజ్, పోలీస్, రవాణా, ఆర్ & బీ, ఇరిగేషన్, వ్యవసాయం తదితర శాఖల సమన్వయంపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ , జిల్లాలో ప్రజల్లో విపత్తులపై అవగాహన పెంపొందించేందుకు, ఎన్డీఆర్ఎఫ్ పాత్రను ప్రజలకు చేరవేయేందుకు ఫామెక్స్ కార్యక్రమాలు కీలకమని అన్నారు . షెడ్యూల్ ప్రకారం రేపటి నుండి 15 రోజులపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో వరద ప్రభావిత ప్రాంతాలు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలలో అవగాహన, సన్నద్ధత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్వైకేఎస్), ఆపద మిత్ర, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, ప్రజాప్రతినిధుల సహకారంతో ఈ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు.ఈ కార్యక్రమాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించే ఫామెక్స్ కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భద్రతా చైతన్యం పెరుగుతుందని, విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ బిటన్ సింగ్ తెలిపారు. విపత్తుల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్షణ చర్యలు, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రాథమిక చికిత్స, నేలకూలిన నిర్మాణాల్లో శోధన మరియు రక్షణ చర్యలు, రసాయన మరియు జీవ విపత్తులకు స్పందన, అగ్ని ప్రమాదాలు, తుపాన్లు, భూకంపాలు వంటి పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేకంగా శిక్షణ అందించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశం లో జడ్ పి సి ఈ ఓ నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరవు, వైద్య శాఖ అధికారి తుకారాం రాతోడ్, విధ్యుత్ శాఖ ఎస్ ఈ మహీందర్,ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు గోవిందరావు, జగదీష్, రంజిత్, ఎస్ డి ఆర్ ఎఫ్ సభ్యులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ