తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మాదకద్రవ్యాల నిర్మూలనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల కఠిన చర్యలు.గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న లక్ష్మీదేవిపల్లి పోలీసులు.మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతో పాటు, గంజాయి వినియోగం, విక్రయం, రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు చేపడుతున్నారు.ఈ నేపథ్యంలో విశ్వసనీయ సమాచారం మేరకు లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతువాగు ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన పోలీసులు గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా గంజాయి సేవించినట్లు నిర్ధారణ కావడంతో వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టి కేసు నమోదు చేశారు.గంజాయి వల్ల కలిగే ఆరోగ్య, మానసిక, కుటుంబ మరియు సామాజిక దుష్పరిణామాలపై ప్రత్యేకంగా అవగాహన కల్పించి, భవిష్యత్తులో మాదకద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం గౌరవ న్యాయస్థానం ఆదేశాల మేరకు వారిని డీ-అడిక్షన్ సెంటర్కు తరలించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ మాట్లాడుతూ, "మాదకద్రవ్యాల నియంత్రణలో పోలీసులు రాజీ పడే ప్రసక్తే లేదని, యువత భవిష్యత్తును కాపాడడం కోసం ఒకవైపు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు నిరంతరం కొనసాగిస్తామని వెల్లడించారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి" అని హెచ్చరించారు.ప్రజలు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని, గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీల్లో చుంచుపల్లి సీఐ ఆర్ వెంకటేశ్వర్లు, ఎస్సై అఖిల, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ