తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భూసేకరణ సర్వేను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ములకలపల్లి గ్రామంలో చేపడుతున్న సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ కెనాల్ భూసేకరణ పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూసేకరణ సర్వే పనుల పురోగతిని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా సర్వే పనులను వేగవంతంగా నిర్వహించాలని సూచించారు. సర్వే సందర్భంగా ఏవైనా సమస్యలు లేదా ఇబ్బందులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ములకలపల్లి గ్రామ పరిధిలో మొత్తం 160 ఎకరాల భూమికి సర్వే నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటివరకు 22 ఎకరాల సర్వే పూర్తయినట్లు అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు. మిగిలిన సర్వేను ప్రణాళికాబద్ధంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భూ సర్వే నిర్వహించే సమయంలో ప్రతి భూ యజమానికి సంబంధించిన వివరాలతో పాటు బోర్లు, సాగులో ఉన్న పంటలు, ఆయిల్ పామ్ తోటలు, ఇతర శాశ్వత ఆస్తుల వివరాలను క్షుణ్ణంగా, కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ అన్నారు . ఈ పరిశీలనలో ములకలపల్లి తాసిల్దార్ స్వాతి బిందు , ఇరిగేషన్ శాఖ అధికారులు, సర్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ