తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఎంకే (మణుగూరు ఖంధన్) పేరుతో గ్యాంగ్ ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న నిందితులపై కఠిన చర్యలు.మణుగూరు నేతాజీ గ్రౌండ్లో 27.08.2026న జరిగిన సింహాద్రి శివకుమార్ @ శివ హత్య కేసును మణుగూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం 27 మంది నిందితులను గుర్తించగా, వారిలో 23 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉండగా, వారిని కూడా త్వరలో పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మృతుడి తండ్రి సింహాద్రి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మణుగూరు పోలీస్ స్టేషన్లో Cr.No.309/2026 U/s 189(2), 103(2), 109(1), 351(3), 61(2) r/w 190 BNS కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.మృతుడు సింహాద్రి శివకుమార్ @ శివ గత కొంతకాలంగా హైదరాబాద్లో ఇంటీరియర్ వర్క్స్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మణుగూరుకు చెందిన ఈర్ల లోకేష్ మరియు శివ వద్ద పనిచేస్తున్న సతీష్ మధ్య గతంలో వివాదాలు ఉన్నాయి. ఈ వివాదంలో శివ, సతీష్కు మద్దతుగా నిలిచి లోకేష్ను అడ్డుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.ఈ విషయాన్ని లోకేష్ జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టికి తెలియజేయడంతో జెట్టి, శివను ఫోన్లో పలుమార్లు బెదిరించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శివతో ఫోన్లో జరిగిన వివాదాలు తీవ్రతరం కావడంతో, శివ మణుగూరుకు వచ్చిన సమయంలో అతనిపై దాడి చేసి హత్య చేయాలని నిందితులు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించారు.27.08.2026న రాఖీ పండుగ సందర్భంగా శివ హైదరాబాద్ నుంచి మణుగూరుకు వచ్చాడు. అతను తన స్నేహితుడు ఉదయ్ కిరణ్తో కలిసి బైక్పై నేతాజీ గ్రౌండ్కు వెళ్లాడు. అక్కడ అప్పటికే పథకం ప్రకారం వేచి ఉన్న నిందితులు శివపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను మృతి చెందాడు. శివతో పాటు వెళ్లిన ఉదయ్ కిరణ్పై కూడా నిందితులు దాడి చేసి హత్యకు ప్రయత్నించగా, అతను వారి నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయాడు. హత్య అనంతరం నిందితులు బైక్లపై మణుగూరు రేగులగండి అటవీ ప్రాంతానికి వెళ్లి, అక్కడ బైక్లను దాచిపెట్టి పరారైనట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎంకె గ్యాంగ్పై దర్యాప్తులో కీలక విషయాలు దర్యాప్తులో జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి గత కొంతకాలంగా “ఎంకె – మణుగూరు ఖంధన్” పేరుతో ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసి, అందులో పలువురు యువకులను సభ్యులుగా చేర్చుకున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ గ్యాంగ్ సభ్యులు పరస్పరం సంప్రదించుకునేందుకు “టీం ఎంకె” పేరుతో వాట్సాప్ గ్రూప్తో పాటు ఇన్స్టాగ్రామ్ ఖాతాను కూడా నిర్వహిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.గ్యాంగ్ సభ్యులు కలిసి తిరుగుతూ, మద్యం సేవిస్తూ జల్సాలకు పాల్పడటం, గొడవలకు దిగడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ గ్యాంగ్కు సంబంధించిన ఇతర కార్యకలాపాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మణుగూరు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి 31.08.2026 ఉదయం సుమారు 8 గంటల సమయంలో మణుగూరు రేగులగండి అటవీ ప్రాంతంలో దాడి చేసి 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుంచి:9 బైక్లు,20 సెల్ఫోన్లు,1 కర్ర,1 చేతి కడియం స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నిందితులను చట్టపరమైన ప్రక్రియ అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు:జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి,కందుల దినేష్చెన్నబోయిన భరత్ @ CHతోలేం జంపయ్య @ పండురాయల వినయ్మహమ్మద్ సాధిక్నెట్టెం వరప్రసాద్గనిబోయిన సాత్విక్ @ చింటూ గుగులోత్ రమేష్ @ గోబికాండ్రు గణేష్నక్క రాజా @ విక్కీకంగాల సాయి జగన్ @ జగన్ఎదలపల్లి నాగేంద్రబాబు @ కన్నికొమెర చంటిఏనిక దినేష్పున్నం వంశీ శివ @ శివకొమరం హరీష్ @ డాన్ఇర్ప శ్రావణ్కలబోయిన మల్లేష్దేవుళ్ల దుర్గా ప్రసాద్అక్కిరెడ్డి అభినయ్ రెడ్డి @ అభిసోయం నరసింహారావు @ రేకుల్ ఈర్ల లోకేశ్వర్ @ లోకేష్ అరెస్ట్ చేసిన నిందితుల్లో జెట్ పట్ రమ్యాకాంత్ @ రమ్మీ @ జెట్టి, గుగులోత్ రమేష్ @ గోబిపై గతంలో పేకాటకు సంబంధించిన కేసులు, చెన్నబోయిన భరత్ మరియు కందుల దినేష్పై కొట్లాటకు సంబంధించిన కేసులు, గనిబోయిన సాత్విక్ @ చింటూపై డెకాయిటీ కేసు మణుగూరు పోలీస్ స్టేషన్లో నమోదైనట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన నిందితులకు గంజాయి సేవించడం, విక్రయించడం లేదా గంజాయి వ్యాపారంతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.మణుగూరు పరిధిలో ఎవరైనా వ్యక్తులు ఏ పేరుతోనైనా గ్యాంగ్లు ఏర్పాటు చేసి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, అల్లర్లు సృష్టిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే, అలాంటి వారిని గుర్తించి వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.ఇలాంటి అసాంఘిక గ్రూపులు, గ్యాంగ్లకు సంబంధించిన సమాచారం ప్రజల దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.యువత చెడు స్నేహాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తుపై దృష్టి సారించాలని మణుగూరు పోలీసులు విజ్ఞప్తి చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ