తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి.. అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధం.సింగరేణి సంస్థలో కార్మికులు, వారి కుటుంబాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారం కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ జోక్యమే ప్రధాన కారణమని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) నాయకులు ఆరోపించారు. గురువారం సాయంత్రం శేషగిరిభవన్లో నిర్వహించిన సమావేశంలో ఏఐటీయూసీ కేంద్ర కార్యదర్శి వంగ వెంకట్, కేంద్ర ప్రచార కార్యదర్శి వీరస్వామి మాట్లాడుతూ కార్మిక సంక్షేమం, సంస్థ అభివృద్ధి, భవిష్యత్ ఉద్యోగ అవకాశాల కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల సింగరేణి తీవ్ర నష్టాలను ఎదుర్కొంటోందని విమర్శించారు. సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న మెడికల్ బోర్డు కేసులు, అలియాస్ పేర్ల మార్పు, పెర్క్స్పై ఆదాయపు పన్ను తొలగింపు, సొంత ఇంటి స్థలాల కేటాయింపు వంటి సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని పేర్కొన్నారు. పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ ఆచరణలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.మెడికల్ ఫిట్ అయిన డిపెండెంట్లకు వెంటనే నియామక ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉండగా, రాజకీయ జోక్యం కారణంగా ఆ ప్రక్రియ ఉద్దేశపూర్వకంగా ఆలస్యం అవుతోందని ఆరోపించారు. దీంతో వందలాది మంది డిపెండెంట్లు ఉద్యోగాల్లో చేరకుండా నిరీక్షించాల్సి వస్తోందని, రిటైర్డ్ కార్మిక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఉద్యోగంలో చేరాల్సిన సమయాన్ని కోల్పోవడం వల్ల డిపెండెంట్లు విలువైన సర్వీస్తో పాటు నెలల తరబడి వేతనాలను కూడా కోల్పోతున్నారని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన సుమారు రూ.56 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. ఈ నిధులు అందకపోవడం వల్ల సంస్థ అభివృద్ధి కార్యక్రమాలు, ఆధునీకరణ పనులు, కొత్త పెట్టుబడులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని తెలిపింది. ఒకవైపు బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను పెంచాలని ఒత్తిడి తెస్తూ, మరోవైపు సంస్థ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించకపోవడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.సింగరేణి భవిష్యత్తుకు కీలకమైన కొత్త కోల్ బ్లాకుల కేటాయింపు, కొత్త బొగ్గు గనుల ప్రారంభం, ఉద్యోగ అవకాశాల విస్తరణ వంటి అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం పాటిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థ విస్తరణ లేకుంటే భవిష్యత్ తరాలకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయని హెచ్చరించారు. యూనియన్తో జరిగిన అధికారిక సమావేశాల్లో అంగీకరించిన అనేక డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వ జోక్యం కారణంగా యాజమాన్యం అమలు చేయడం లేదని మండిపడ్డారు. సింగరేణిలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం కార్మిక వర్గం ఇక మౌనంగా ఉండబోదని స్పష్టం చేసిన ఏఐటీయూసీ నాయకులు, అవసరమైతే నిరవధిక సమ్మెకు సిద్ధమవుతామని హెచ్చరించారు. కార్మికుల హక్కులు, సింగరేణి భవిష్యత్ పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ పోరాటానికి అన్ని కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, కార్మికులు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కార్యదర్శి వి. మల్లికార్జున్ రావు, కార్పొరేట్ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.వి. రమణమూర్తి, వైస్ ప్రెసిడెంట్లు క్రిస్టోఫర్, సహాయ కార్యదర్శులు గట్టయ్య, రాము, ఆఫీస్ బేరర్లు సందబోయిన శ్రీనివాస్, నాగయ్య, నితిన్, పిట్ కార్యదర్శులు ఎం.ఆర్.కే. ప్రసాద్, కమల్, రమేష్, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ