తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ విద్యార్థుల సౌకర్యాలు, పాఠశాల వసతుల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ క్రమంలో సోమవారం పాత కొత్తగూడెం ప్రాంతంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, వసతులు, మద్యాహ్న భోజన వంటశాల, శానిటేషన్ వ్యవస్థలను ప్రత్యక్షంగా పరిశీలించారు. మద్యాహ్న భోజన వంటశాలలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యత, శుభ్రత, మరియు మెనూ వివరాలను కలెక్టర్ ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో పోషకాహారం ముఖ్యమైన పాత్ర వహిస్తున్నందున, ప్రతి రోజూ నాణ్యమైన ఆహారం అందేలా చూడాలని సూచించారు. గుడ్లు, కూరగాయలు, పాలు వంటి పోషక పదార్థాలను తప్పక భోజనంలో చేర్చాలని ఆదేశించారు. కలెక్టర్ గుడ్లు వండుతున్నారా? అని ప్రశ్నించినప్పుడు సిబ్బంది, టెండర్ సంస్థ నుండి సరఫరా లభించలేదని తెలిపారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ, జిల్లావ్యాప్తంగా ఉన్న యూఆర్ఎస్ (URS) మరియు కేజీబీవీఎస్ (KGBVS) పాఠశాలల్లో కూడా ఇటువంటి సమస్యలు ఉన్నాయో గుర్తించి, తక్షణమే నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ఆహార సరఫరాలో ఎటువంటి అంతరాయం రాకుండా నాణ్యతతో కొనసాగించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. పాఠశాల పరిధిలోని మరుగుదొడ్లు, స్నానగదులు, హాస్టల్ గదులను కలెక్టర్ పరిశీలించారు. కొన్ని సెప్టిక్ ట్యాంకులు బ్లాక్ అయ్యి ఉన్నాయని సిబ్బంది తెలియజేశారు. వీటి మరమ్మతులు సంబంధిత ఇంజనీరింగ్ అధికారుల ద్వారా వెంటనే చేయాలన్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణలో నిల్వ నీరు ఉన్న ప్రాంతాలను శుభ్రపరచి, దోమల పెరుగుదలను నివారించడానికి సమయానుకూల చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థుల హాజరు, పాఠశాల విద్యార్థుల సంఖ్య, విద్యా ప్రమాణాలు, క్రమశిక్షణ వంటి అంశాలను కలెక్టర్ సవివరంగా తెలుసుకున్నారు. గత సంవత్సరం విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీ చేసినట్లు, ఈ సంవత్సరం కూడా అదే విధంగా పంపిణీ చేయనున్నట్లు అధికారులు వివరించారు. పాఠశాల భవనం విద్యార్థుల సంఖ్యకు తగినంత కాకపోవడం అంశాన్ని సిబ్బంది వెల్లడించారు. విద్యార్థులు సౌకర్యవంతమైన వాతావరణంలో చదువుకునేలా చూడటం మన అందరి బాధ్యత అని కలెక్టర్ పేర్కొన్నారు. అవసరమైతే పాఠశాలను నూతన భవనంలోకి మార్చడం లేదా కొత్త ప్రదేశంలో కొత్త భవనం నిర్మించడం కోసం చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పాఠశాల పరిశుభ్రతను మెరుగుపరచడానికి ఎలక్ట్రికల్ క్లీనింగ్ మెషిన్ను అందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణం విద్యార్థుల ఆరోగ్యానికి, నేర్చుకునే ఉత్సాహానికి దోహదపడుతుందని స్పష్టం చేశారు. పాఠశాల పరిశుభ్రతలో ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోరాదని బలంగా సూచించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట సెక్టోరియల్ అధికారి ఏ. నాగరాజ శేఖర్, ఏఈ రాజమౌళి, పాఠశాల ప్రత్యేక అధికారి రాంబాయి, బోధన సిబ్బంది మరియు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ