తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈ రోజు భద్రాద్రి జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్ అధికారుల,కార్మిక, మరియు పెన్షనర్ల జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక TS UTF భావన్ నందు పాత్రికేయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ నాయకులు పాల్గొని ఉద్యోగుల సమస్యలు, నిన్నటి చర్చల వివరాలు మరియు భవిష్యత్ ప్రణాళికలపై మాట్లాడటం జరిగింది. జిల్లా ఛైర్మన్ అమరనేని రామారావు మాట్లాడుతూ:రాష్ట్ర జేఏసీ నిర్ణయం మేరకు నేటి ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని తెలిపారు. నిన్న సీఎస్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘ చర్చలు జరిపిన తరువాత, ప్రభుత్వం ఇచ్చిన లిఖితపూర్వక హామీ మేరకు వేతన సవరణ సంఘం (పీఆర్సీ) నివేదికను త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమర్పించాలని పీఆర్సీ కమిషన్ చైర్మన్ శివశంకర్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. వచ్చే దసరా పండుగ నుంచే పీఆర్సీని అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే సానుకూలంగా స్పందించాలని కోరారు.కన్వీనర్ సంగం వెంకట పుల్లయ్య మాట్లాడుతూ: రాష్ట్ర ప్రభుత్వం తరపున నిన్న గౌరవ సీఎస్ మరియు ఉన్నతాధికారుల అధ్యక్షతన రాష్ట్ర జేఏసీతో జరిపిన చర్చల ఫలితంగా, ఈ నెల 18వ తేదీన మలిదశ చర్చలు జరపాలని నిర్ణయించడం శుభపరిణామమన్నారు. ప్రాథమిక సభ్యుడి ఆలోచనలకు అనుగుణంగా స్నేహపూర్వక వాతావరణంలోనే సమస్యలు పరిష్కారమవుతాయని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉద్యోగుల డీఏలు మరియు బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, కనీసం మూడు డీఏలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం నెలకు రూ. 2 వేల కోట్లు కేటాయించాలని, ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు రూ. 11 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్లో ఉన్నాయని గుర్తుచేశారు.PRTU TS జిల్లా అధ్యక్షులు నరసయ్య మాట్లాడుతూ: ముఖ్యమంత్రి ఎన్నికల హామీ మేరకు సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉందన్నారు. నిన్నటి చర్చలలో భాగంగా సీపీఎస్కు సంబంధించిన అంశాలపై పీఆర్సీ నిపుణులు, ఉన్నతాధికారులు మరియు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ప్రత్యేక కమిటీని నియమిస్తామని ప్రభుత్వం వెల్లడించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. ఈ కమిటీ ద్వారా ఉద్యోగులకు తగిన న్యాయం జరగాలని ఆకాంక్షించారు. అలాగే 18వ తేదీన జరిగే చర్చల్లో ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (NEHS) పై కూడా స్పష్టమైన నిర్ణయం వచ్చేలా చర్యలు ఉండాలని రాష్ట్ర జేఏసీకి సూచించారు.TNGOS జిల్లా కార్యదర్శి భార్గవ చైతన్య మాట్లాడుతూ:ఉద్యోగ సంఘాల నిరసనల తీవ్రతను గుర్తించిన ప్రభుత్వం, జీఏడీ ద్వారా రాతపూర్వక హామీ ఇచ్చి ప్రకటన జారీ చేయడంతో 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని తెలిపారు. డిజిటల్ మాధ్యమాలు, సోషల్ మీడియా వ్యాప్తంగా హక్కుల కోసం ఉద్యోగులు చేస్తున్న ఆర్తనాదాలు, నెరవేరని హామీలపై వస్తున్న ఆక్రోశపూరిత పోస్టులే ఉద్యోగుల అసంతృప్తికి అద్దం పడుతున్నాయని అన్నారు. జేఏసీ నాయకత్వం ఎక్కడా వెనక్కి తగ్గకుండా, ఉద్యోగుల ఐక్య బలాన్ని ప్రభుత్వానికి చూపించి చర్చలు టేబుల్పైకి తెచ్చేలా చేయడంలో విజయం సాధించిందన్నారు. 18వ తేదీన జరిగే చర్చల్లో ఉద్యోగులకు స్పష్టమైన లబ్ధి జరగకపోతే, వెనువెంటనే ఉత్తర్వులు (జీవోలు) రాకపోతే... 19న జరిగే జేఏసీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రతి ప్రాథమిక సభ్యుడిని సంపూర్ణంగా ఒప్పించి, ప్రత్యక్ష పోరాటానికి నాయకత్వం సిద్ధపడాలని, సామాన్య ఉద్యోగి నమ్మకాన్ని గెలుచుకోవాలని రాష్ట్ర నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సమావేశంలో TNGO రాష్ట్ర కార్యదర్శి వీరబాబు గారు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ