తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : రాష్ట్రంలో ప్రజాపాలన ప్రతిబింబించే విధంగా గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం అమలు, ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల ఏర్పాట్లపై మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే. రామకృష్ణా రావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఐ డి ఓ సి కార్యాలయం వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభల నిర్వహణ ఒకే విధానంలో ఉండాలని, గ్రామ సభలకు వార్డు సభ్యుల నుండి ఎంపీ, ఎమ్మెల్యేల వరకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని తెలిపారు. గ్రామసభలో ముఖ్యమంత్రి సందేశంతో పాటు ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను చదివి వినిపించాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యం పంపిణీ, గిరిజన రైతులకు ఉచిత పంపు సెట్లు వంటి పథకాల లబ్ధిదారులను గ్రామసభలో మాట్లాడేలా చేయాలని తెలిపారు. జూన్ 2 నుండి ప్రారంభించనున్న ఇందిరమ్మ జీవిత భీమా పథకం, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, పాలు, రాగి జావా పంపిణీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వంటి కార్యక్రమాలపై ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ను విస్తృతంగా ప్రచారం చేయాలని, సాంస్కృతిక శాఖ కళాకారుల ద్వారా పథకాలపై అవగాహన పెంచేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని అన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.సీఎస్ కే. రామకృష్ణా రావు మాట్లాడుతూ మార్చి 6 నుండి 15 వరకు నిర్వహించిన పెండింగ్ ఫైల్స్ పరిష్కారం, పారిశుద్ధ్య కార్యక్రమాలకు మంచి స్పందన లభించిందని తెలిపారు. అదే స్పూర్తితో గ్రామ, వార్డు సభలను విజయవంతంగా నిర్వహించాలని, ప్రతి జిల్లాలో గ్రామసభల నిర్వహణపై నివేదికలు అందించాలని కలెక్టర్లను ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా హాజరు కావాలని అన్నారు.గ్రామసభలలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు, గ్రామ సమస్యలు గుర్తించి వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీ వార్డుల్లో కూడా ఇలాంటి సభలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదించిన పథకాల మార్గదర్శకాలను కూడా ప్రజలకు వివరించాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ*గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించి వారి నుంచి అవసరమైన సలహాలు, సూచనలు స్వీకరించాలన్నారు. జిల్లా, డివిజన్, మండలం, గ్రామస్థాయి వరకు కేటాయించిన విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో చేపట్టిన పనులు ప్రజలకు వివరించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో వార్డు సభలను నిర్వహించి ప్రజలకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సభలకు స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామపంచాయతీలలో గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులను నియమించాలని, ముందస్తు షెడ్యూల్ సిద్ధం చేసి సంబంధిత అధికారులకు తెలియజేయాలని అన్నారు .గ్రామసభల్లో లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించి, జాబితాలను ప్రజలకు చదివి వినిపించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.ఈ సమావేశం లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యచందన, జేడ్పిసిఈఓ నాగలక్ష్మి, సి పి ఓ సంజీవరావు, వ్యవసాయ శాఖ అధికారిబాబురావు, వైద్య శాఖ అధికారులు తుకారాం రాథోడ్, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లేనినా, డి పి ఓ సుధీర్ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ