తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొంగరకలాన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరిగిన "గిరిదర్శక్" కార్యక్రమ ప్రారంభోత్సవంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ భద్రాద్రి కొత్తగూడెం,ములుగు జిల్లాలను ప్రత్యేక దృష్టి ఉన్న జిల్లాలుగా గుర్తించడం జరిగింది.గతంలో మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉన్న ఏజెన్సీ ప్రాంతాలలో ఇప్పుడు నివసించే యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా మంగళవారం కొంగరకళాన్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభమైన పలు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గిరిదర్శక్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.భద్రాచలం,పర్ణశాల,కిన్నెరసాని వంటి ఆధ్యాత్మిక,ఆహ్లాదకరమైన పర్యాటక ప్రాంతాలు కలిగిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మారుమూల ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే 18 నుండి 35 సంవత్సరాల వయసు కలిగిన యువకులను గుర్తించి వారికి తగిన శిక్షణను ఇప్పించి ఇట్టి పర్యాటక స్థలాలలో వారిని నియమించే కార్యక్రమమే ఈ గిరిదర్శక్.మొదటి విడుతలో భాగంగా పదిమంది యువకులను గుర్తించి వారికి 21 నుండి 28 రోజుల పాటు జిల్లాలోని ఆయా ప్రదేశాల గురించి అవగాహన,మాట్లాడే తీరు,ప్రకృతి మరియు వన్యప్రాణుల గురించి జ్ఞానం,ప్రథమ చికిత్స వంటి విషయాలలో శిక్షణ ఇప్పించడం జరుగుతుందని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు.అటవీ,దేవాదాయ పర్యాటక,గిరిజనాభివృద్ధి శాఖలతో సమన్వయంతో పోలీసు శాఖ ఈ అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు.గిరిజన గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి మాట్లాడే నైపుణ్యం,ఆత్మవిశ్వాసం,స్థానిక జ్ఞానం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి తదుపరి సరైన శిక్షణ ఇప్పించడం జరుగుతుందని తెలియజేశారు.శిక్షణ పొందిన అభ్యర్థులకు వేతనాన్ని కల్పిస్తూ జిల్లాలోని వివిధ పర్యాటక ప్రదేశాల్లో భర్తీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇప్పటివరకు అభివృద్ధికి దూరంగా ఉన్న ఏజెన్సీ ప్రాంత ప్రజలను అభివృద్ధి వైపు నడిపించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇతర శాఖల సమన్వయంతో పోలీస్ శాఖ పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూనే ఉంది.వినూత్నంగా చేపడుతున్న ఈ "గిరిదర్శక్" కార్యక్రమం ద్వారా ఎంతోమంది గిరిజన యువతకు మేలు జరుగుతుందని భావిస్తున్నామని ఎస్పీ ఆకాంక్షించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ