తెలుగు వెలుగు టీవీ - వార్తలు / జూలూరుపాడు : జూలూరుపాడు మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం & జూనియర్ కళాశాల, అలాగే పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా కలెక్టర్ అంకిత్ మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా స్థాయి, ఆహార నాణ్యత, తాగునీటి సదుపాయాలు, మౌలిక వసతులు, పరిపాలనా వ్యవస్థపై సమగ్రంగా పరిశీలించారు.మొదటగా కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం మరియు జూనియర్ కళాశాలను సందర్శించిన కలెక్టర్, ఎనిమిదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారికి ఎదురవుతున్న సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులు తీసుకుంటున్న టిఫిన్, భోజన నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా అనే విషయాన్ని నిర్ధారించుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లీష్ పాఠ్యపుస్తకాన్ని చదివించి వారి పఠన సామర్థ్యాన్ని పరీక్షించారు. సిలబస్ పూర్తిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. డైనింగ్ హాల్, కిచెన్ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ, బీట్రూట్ వంటి కూరగాయలు అందించకపోవడంపై సిబ్బందిని ప్రశ్నించారు. విద్యార్థులకు తప్పనిసరిగా నాణ్యమైన, తాజా కూరగాయలతో ఆహారం అందించాలని ఆదేశించారు.విద్యార్థులు చేతులు శుభ్రపరచుకునే ప్రదేశంలో ట్యాపులు లేకపోవడం, మరమ్మతులు చేపట్టకపోవడంపై వివరణ కోరారు. పాఠశాలలో గ్యాస్ సదుపాయం, సిలిండర్ల లభ్యత, వంట సిబ్బంది సంఖ్య, నెలవారీ వ్యయాలపై వివరాలు తెలుసుకున్నారు. పనిచేయకుండా ఉన్న ఆర్.ఓ ప్లాంట్పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, తక్కువ వ్యయంతో మరమ్మతులు చేయవచ్చని ఉన్నప్పటికీ బయట నుంచి నీటి సరఫరా కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. అనవసర ఖర్చులను తగ్గించి నిర్వహణ నిధులను విద్యార్థుల సౌకర్యాల కోసం వినియోగించాలని సూచిస్తూ, ఒక వారం రోజుల్లో ఆర్.ఓ ప్లాంట్ను మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు.పాఠశాలలో సరుకుల సరఫరా విధానం, ఏఎన్ఎం అందుబాటు, రాత్రి డ్యూటీ సిబ్బంది వివరాలు, డ్యూటీ షెడ్యూల్, విద్యార్థుల టైమ్ టేబుల్ను పరిశీలించారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మజ పాఠశాలలో 166 మంది విద్యార్థులు, జూనియర్ కళాశాలలో 92 మంది విద్యార్థులు ఉన్నట్లు వివరించారు.అనంతరం పడమటి నర్సాపురం గిరిజన బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్, తరగతి గదులను పరిశీలించి ఏడవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు అందుతున్న సదుపాయాలు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు. పాఠశాలలో మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రధానోపాధ్యాయులు సుభద్ర తెలిపారు.భోజనశాల, కిచెన్ షెడ్ను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని రుచి చూసి నాణ్యతను పరీక్షించారు. స్టోర్ రూమ్లో నిల్వ ఉంచిన కూరగాయలను పరిశీలించిన సమయంలో దుర్వాసన రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుళ్లిన కూరగాయలను వెంటనే తొలగించాలని ఆదేశిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వంటకు నాణ్యమైన, తాజా కూరగాయలనే వినియోగించాలని స్పష్టం చేశారు.స్టోర్ రూమ్లో నిల్వ ఉన్న బియ్యం తదితర సరుకులను పరిశీలించి వాటి నాణ్యతపై విచారణ చేశారు. ఆర్.ఓ ప్లాంట్ను పరిశీలించి తాగునీటి సదుపాయాలపై వివరాలు తెలుసుకున్నారు. సిబ్బంది హాజరు రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్లను తనిఖీ చేశారు. విద్యార్థులకు యూనిఫార్ములు, నైట్ డ్రెస్సులు, స్పోర్ట్స్ డ్రెస్సులు సమయానికి అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు.పాఠశాలలో ఏర్పాటు చేసిన బయోమెట్రిక్ యంత్రాలు పనిచేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసిన కలెక్టర్, అవి వినియోగంలో లేకపోతే ఎందుకు ఉంచారో ప్రశ్నించారు. కేవలం అలంకారంగా ఉంచడానికేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వాటిని వెంటనే మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని లేదా అవసరం లేకపోతే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, “విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన, పోషకాహారం తప్పనిసరిగా అందించాలి. పాఠశాలల్లో శుభ్రమైన త్రాగునీరు, పరిశుభ్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదు. పనిచేయని ఆర్.ఓ ప్లాంట్లు, బయోమెట్రిక్ యంత్రాలను అలాగే ఉంచడం సరైంది కాదు. ఇవి అలంకారానికి కాదు. వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలి లేదా తొలగించాలి. అనవసర ఖర్చులను తగ్గించి విద్యార్థుల సౌకర్యాల అభివృద్ధికి నిధులు వినియోగించాలి. విద్యార్థుల ఆరోగ్యం, విద్యా నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి” అని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట తాసిల్దార్ శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ