తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సిపిఐ మండల, పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికార అధికారులకు సహకరించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా సూచించారు. బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్' నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నిస్పక్షపాతంగా ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. జూన్ 25 నుండి జూలై 24, 2026 వరకు ఇంటింటి సర్వే జరుగుతుందని, అనంతరం జులై 31న సేకరించిన వివరాల ఆధారంగా ముసాయిదా ఓటర్ల జాబితాను అధికారులు ప్రచురిస్తారని తెలిపారు. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు అభ్యంతరాలను స్వీకరించి, నోటీసులు జారీ చేయడం జరుగుతుందన్నారు. ప్రక్రియ అంతా పూర్తయిన తర్వాత అక్టోబర్ 1న అధికారులు తుది జాబితాను విడుదల చేస్తారని వివరించారు. పార్టీ నాయకులు తక్షణమే రెవెన్యూ అధికారులకు పార్టీ నుంచి బాధ్యత వహించే బిఎల్ఏల వివరాలు అందించాలని కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ