తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : ప్రభుత్వ విద్య పరిరక్షణకై సమరశీల పోరాటాలు.విద్యార్థులకు అండగా ఏఐఎస్ఎఫ్ జెండా. భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తితో ఆవిర్భవించిన ఏకైక విద్యార్థి సంఘం అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) అని ఆ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వరక అజిత్ అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ, శాస్త్రీయ విద్య, కామన్ విద్యా విధానం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతోందని తెలిపారు.ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో అజిత్ అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 1936 ఆగస్టు 12న లక్నోలో ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని, స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు విద్యార్థుల హక్కుల కోసం సంఘం అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు.ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ, శాస్త్రీయ విద్య, సమాన విద్యా విధానం అమలు కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏఐఎస్ఎఫ్ పోరాటాలు కొనసాగిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన జాతీయ విద్యా విధానం వల్ల ప్రభుత్వ విద్యారంగంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణకు ప్రాధాన్యం కల్పించే విధానాలను విద్యార్థులు, ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.శాస్త్రీయ దృక్పథంతో కూడిన విద్యకు బదులుగా మూఢనమ్మకాలు, పురాణాలను ప్రోత్సహించే విధానాలకు విద్యార్థులను దూరంగా ఉంచాలని అన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై భవిష్యత్తులో మరిన్ని సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.90 ఏళ్లకు పైగా విద్యార్థి ఉద్యమ చరిత్ర కలిగిన ఏఐఎస్ఎఫ్ జెండా కింద విద్యార్థులంతా ఐక్యమై హక్కుల సాధన కోసం పోరాడాలని అజిత్ పిలుపునిచ్చారు.కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు కొరిమి సంజయ్, కళాశాల సమితి సభ్యులు నిఖిల్, హాసిని, అంజలి, మౌనిక, కళ్యాణి, వంశీ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ