తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జిల్లాలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణను తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి డిప్యూటీ సెక్రటరీ సిహెచ్. హేమచందర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావుతో కలిసి కొత్తగూడెం, పాల్వంచ, అశ్వరావుపేట, ములకలపల్లి మరియు భద్రాచలం ప్రాంతాల్లోని పలు పరీక్షా కేంద్రాలను ఆయన సందర్శించారు.ఈ తనిఖీల సందర్భంగా పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు కల్పించిన మౌలిక వసతులు, ల్యాబ్ ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ, ప్రశ్నపత్రాల గోప్యత, పరీక్షల నిర్వహణ విధానాలు, పారదర్శకత తదితర అంశాలను డిప్యూటీ సెక్రటరీ పరిశీలించారు. నిబంధనల ప్రకారం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు, పరీక్షా సిబ్బందికి సూచనలు చేశారు.ఈ రోజున నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షల హాజరు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం నిర్వహించిన పరీక్షలలో జనరల్ విభాగంలో 923 మందికి గాను 898 మంది హాజరుకాగా 25 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్య విభాగంలో 407 మందికి గాను 383 మంది హాజరై 24 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా 1330 మందికి గాను 1281 మంది హాజరు కాగా 49 మంది గైర్హాజరయ్యారు.మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షలలో జనరల్ విభాగంలో 782 మందికి గాను 761 మంది హాజరై 21 మంది గైర్హాజరయ్యారు. వృత్తి విద్య విభాగంలో 300 మందికి గాను 278 మంది హాజరై 22 మంది గైర్హాజరయ్యారు. మొత్తంగా మధ్యాహ్నం 1082 మందికి గాను 1039 మంది హాజరు కాగా 43 మంది గైర్హాజరయ్యారు. మొత్తం రోజువారీగా రెండు సెషన్లలో కలిపి 2412 మందికి గాను 2320 మంది హాజరై 92 మంది గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అన్ని పరీక్షా కేంద్రాల్లో కట్టుదిట్టమైన పర్యవేక్షణ కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ