తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమర సాహసంతో పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ మహిళా శక్తికి ప్రతీకగా నిలిచారని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో, ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ – భూమి, భుక్తి కోసం చరిత్ర సృష్టించిన చాకలి ఐలమ్మ గారి పోరాటపటిమ నేటికీ స్ఫూర్తిదాయకం అన్నారు. అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగం అమూల్యం. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలను స్మరించుకోవాలి అని, ముఖ్యంగా యువత, మహిళలు ఆమె పోరాటస్ఫూర్తిని అనుసరించి సమాజ అభివృద్ధికి కృషి చేయాలి అని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ చూపిన దారి స్త్రీ సాధికారతకు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకత్వం చేస్తుందని కలెక్టర్ తెలిపారు. ఆమె జీవితం నుంచి తీసుకునే స్ఫూర్తి నేటి తరాలకి మానవ విలువలు, సామాజిక న్యాయం, ధైర్యసాహసాల పాఠం నేర్పుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి శ్రీలత, బీసీ సంఘ నాయకులు అజిత్ కుమార్, ముదిగొండ రాంబాబు, సర్వేష్, జంగంపల్లి రాజు, దురిశెట్టి కుమార్, విజయలక్ష్మి, కొదుమూరి సత్యనారాయణ, కాపర్తి వెంకటాచారి మరియు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ